ముగిసిన జాతర

ABN , First Publish Date - 2023-01-26T00:35:32+05:30 IST

ఉత్తరాంధ్రుల ఇలవేల్పు, కోర్కెలు తీర్చే కల్పవల్లి శంబర పోలమాంబ జాతర బుధవారం అంపకోత్సవంతో ముగిసింది.

 ముగిసిన  జాతర
గ్రామంలో ఘటాలను ఊరేగిస్తున్న దృశ్యం

పోలమాంబకు ప్రత్యేక పూజలు

అమ్మవారి దర్శనానికి బారులుదీరిన భక్తులు

సాలూరు రూరల్‌/మక్కువ,జనవరి 25: ఉత్తరాంధ్రుల ఇలవేల్పు, కోర్కెలు తీర్చే కల్పవల్లి శంబర పోలమాంబ జాతర బుధవారం అంపకోత్సవంతో ముగిసింది. ఈ సందర్భంగా సంప్రదాయం ప్రకారం అమ్మవారి ఘటాలను గ్రామంలో తిరువీధితో చదురు గుడి నుంచి వనం గుడికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో దారి పొడవునా భక్తులు చీరలను పరిచారు. ఘటాలకు ప్రత్యేక పూజలు చేశారు. పాల జంగిడిని మోయడానికి మహిళలు పోటీ పడ్డారు. పోలమాంబ జాతరలో ప్రధాన ఘట్టమైన సిరిమానోత్సవం ముగియడంతో చివరి రోజు అంపకోత్సవం సందర్భంగా గ్రామస్థులు మొక్కుబడులు చెల్లించారు. బంధువులు, స్నేహితులకు విందులు ఏర్పాటు చేశారు. మొత్తంగా గ్రామంలో ప్రతి ఇల్లు సందడిగా మారింది. వివిధ దుకాణాలు కొనుగోలుదారులతో రద్దీగా కనిపించాయి. జాతర విజయవంతంగా ముగియడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

చదురుగుడికి భక్తుల తాకిడి

అంపకోత్సవం పురస్కరించుకుని శంబర పోలమాంబ చదురుగుడికి మూడోరోజు కూడా భక్తులు పోటెత్తారు. సిరిమానోత్సవం రోజున దర్శనానికి రాలేని సుదూర ప్రాంతాల భక్తులు భారీగా తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. కోళ్లు, చీరలతో మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల రద్దీకి అనుగుణంగా దేవాదాయ శాఖాధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ నెల 22 నుంచి 24 వరకు 6 లక్షల 60 వేల 566 రూపాయలు ఆదాయం వచ్చినట్టు ఈవో వి.రాధాకృష్ణ తెలిపారు. ఈనెల 31న మారుజాతర జరగనుందని చెప్పారు.

Updated Date - 2023-01-26T00:35:33+05:30 IST