కల్వర్టు నిర్మించాల్సిందే
ABN , First Publish Date - 2023-01-25T00:20:00+05:30 IST
విశాఖపట్టణం నుంచి రాయపూర్ వరకూ నిర్మిస్తున్న రహదారిపై వసంత గ్రామం వద్ద కల్వర్టు నిర్మించాలని, లేకుంటే రోడ్డుకు ఒక వైపు పంట పొలాలకు చెరువు నీరు అందదని రైతులు ఆందోళన నిర్వహించారు. కొన్నాళ్లుగా వివిధ రూపాల్లో నిరసన తెలియజేస్తున్న రైతులు తాజాగా మంగళవారం రోడ్డుపై ధర్నా చేశారు.
గ్రీన్ఫీల్డ్ రహదారిపై వసంత గ్రామ రైతుల నిరసన
గంట్యాడ, జనవరి 24: విశాఖపట్టణం నుంచి రాయపూర్ వరకూ నిర్మిస్తున్న రహదారిపై వసంత గ్రామం వద్ద కల్వర్టు నిర్మించాలని, లేకుంటే రోడ్డుకు ఒక వైపు పంట పొలాలకు చెరువు నీరు అందదని రైతులు ఆందోళన నిర్వహించారు. కొన్నాళ్లుగా వివిధ రూపాల్లో నిరసన తెలియజేస్తున్న రైతులు తాజాగా మంగళవారం రోడ్డుపై ధర్నా చేశారు. అక్కడే వంటావార్పు కూడా చేపట్టారు. తాము కోరిన చోట కల్వర్డు నిర్మించాలంటూ డిమాండ్ చేశారు. గ్రామానికి చెందిన రైతులు వసంత, తాండ్రంగి సరిహద్దుకు మంగళవారం ఉదయానే చేరుకున్నారు. అనంతరం టెంట్ వేసి ధర్నాకు దిగారు. పోరాట కమిటీ కన్వీనర్ బి.రాంబాబు మాట్లాడుతూ జాతీయ రహదారి నిర్మాణంలో రైతుల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. రైతులు కోరిన చోట కల్వర్డు నిర్మించకపోతే భవిష్యత్లో పంటలు సాగుకు ఇబ్బంది వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇరిగేషన్ అధికారులు కల్వర్టు నిర్మించాలని సూచించినా హైవే అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. ఇప్పటికైనా స్పందించకుంటే పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో గ్రామానికి చెందిన గుల్లుపల్లి గంగునాయుడు, సిరికి సత్యనారాయణ, చొక్కాకు సత్యారావు, పోలినాయుడు, కొల్లి వెంకటరావు, కసిరెడ్డి రామారావు తదితరులు పాల్గొన్నారు.