సమన్వయ సేవలతోనే స్త్రీశిశు సంక్షేమం
ABN , First Publish Date - 2023-02-02T01:23:11+05:30 IST
ఆశ, ఏఎన్ఎం, అంగన్వాడీలు సమన్వయంతో పనిచేసినప్పుడే గ్రామాల్లో స్త్రీశిశు సంక్షేమం సాకారమవుతుందని జిల్లా కలెక్టర్ రవి పట్టన్శెట్టి అన్నారు.
రక్తహీనత ఉన్న వారికి పౌష్టికాహారం అందించాలి
ప్రతి కుటుంబ ఆరోగ్య పరిస్థితి తెలిసి ఉండాలి
అనకాపల్లి టౌన్, ఫిబ్రవరి 1 : ఆశ, ఏఎన్ఎం, అంగన్వాడీలు సమన్వయంతో పనిచేసినప్పుడే గ్రామాల్లో స్త్రీశిశు సంక్షేమం సాకారమవుతుందని జిల్లా కలెక్టర్ రవి పట్టన్శెట్టి అన్నారు. అనకాపల్లి పట్టణంలోని గాంధీనగరం సచివాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. పీహెచ్సీ వైద్యులు, సీడీపీవోలు తల్లీపిల్లల ఆరోగ్య పరిస్థితులపై ప్రత్యేకదృష్టి సారించాలన్నారు. క్షేత్రస్థాయిలో జరుగుతున్న విషయాల పట్ల అవగాహన కలిగి ఉండాలన్నారు. ముఖ్యంగా గర్భిణుల ఆరోగ్యం, కాన్పుల పట్ల మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించారు. రక్తహీనతను గుర్తించడం, దానికి తగిన చికిత్సతో పాటు పౌష్టికాహారం అందించడం ముఖ్యమని చెప్పారు. కౌమార దశలో రక్తహీనత ఉన్నవారిని, గర్భిణులను గుర్తించి తగిన పౌష్టికాహారం అందజేయాల్సి ఉందన్నారు. ప్రతి కుటుంబం యొక్క ఆరోగ్య పరిస్థితులు ఆశ, ఏఎన్ఎం, అంగన్వాడీ కార్యకర్తలకు పూర్తిగా తెలిసి ఉండాలని స్పష్టం చేశారు. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ను ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకువెళ్లాలని చెప్పారు. ఈ సమావేశంలో డీఎంహెచ్వో డాక్టర్ హేమంత్, డీసీహెచ్ఎస్ శ్రావణ్కుమార్, స్త్రీశిశు సంక్షేమశాఖ పీడీతో పాటు జిల్లాలోని పీహెచ్సీల వైద్యులు, ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.