లోయలోకి దూసుకుపోయిన కారు
ABN , First Publish Date - 2023-02-02T00:38:37+05:30 IST
లోయలోకి కారు దూసుకుపోయి కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఓ పర్యాటకుడు మృతి చెందాడు. మరో ఇద్దరు యువకులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి ఘాట్ రోడ్డులో బుధవారం జరిగిన ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి.
పర్యాటకుడి మృతి
మరో ఇద్దరికి స్వల్ప గాయాలు
మృతుడు కర్ణాటక రాష్ట్రం కోలార్ వాసి
అరకులోయ, ఫిబ్రవరి 1: లోయలోకి కారు దూసుకుపోయి కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఓ పర్యాటకుడు మృతి చెందాడు. మరో ఇద్దరు యువకులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి ఘాట్ రోడ్డులో బుధవారం జరిగిన ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి. కర్ణాటకలోని కోలార్ పట్టణానికి చెందిన ముగ్గురు యువకులు మురళీ సోమశేఖర్ (27), అర్జున్, శ్రీకాంత్ కలిసి మన్యం పర్యటన కోసం వచ్చారు. మంగళవారం విశాఖపట్నంలో కారు అద్దెకు తీసుకుని అరకులోయ చేరుకున్నారు. ఇక్కడ గిరిజన మ్యూజియం, పద్మాపురం గార్డెన్స్ తదితర కేంద్రాలను సందర్శించారు. రాత్రి అరకులోయలో బస చేశారు. బుధవారం తెల్లవారుజామున తిరిగి కారులో విశాఖపట్నం బయలుదేరారు. అనంతగిరి ఘాట్ రోడ్డులోని డముకు-తైడా మధ్యలో హెయిర్ పిన్ బెండ్ నంబరు-6 మలుపు వద్ద కారు అదుపుతప్పి లోయలోకి దూసుకుపోయింది. ఈ ఘటనలో కారు డ్రైవ్ చేస్తున్న మురళీ సోమశేఖర్ (27) సంఘటనా స్థలంలోనే మృతిచెందాడు. అర్జున్, శ్రీకాంత్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఘాట్ రోడ్డులో ప్రయాణం కొత్తకావడం, మరోవైపు తెల్లవారుజామున పొగమంచు ఎక్కువగా ఉండడంతో అదుపుతప్పి వుండవచ్చునని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. అనంతగిరి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని లోయలోని కారులో పడివున్న మురళీ మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం ఎస్.కోట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు జరుపుతున్నామని పోలీసులు తెలిపారు.