Pawan Kalyan: జనసేన పార్టీకి విరాళం ఇచ్చిన మొదటి నాయకుడు ఆయన..
ABN , First Publish Date - 2023-01-29T11:24:30+05:30 IST
మాజీ మంత్రి వట్టి వసంత్కుమార్ (Vatti Vasanth Kumar) తుది శ్వాస విడిచారని తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అన్నారు.
అమరావతి: మాజీ మంత్రి వట్టి వసంత్కుమార్ (Vatti Vasanth Kumar) తుది శ్వాస విడిచారని తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అన్నారు. ఈ సందర్భంగా ఆదివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ పంజా సాయిధరమ్ తేజ్ (Saidharam Tej) ద్వారా వసంతకుమార్తో బంధుత్వం కూడా ఉందని అన్నారు. పోరాట యాత్ర సందర్భంలో ఆయనతో భేటీ అయ్యానని చెప్పారు. ఆ తరవాత పలు సందర్భాల్లో ఆయనతో చర్చలు జరిపేవాడినని, ఎంతో ప్రోత్సాహకరంగా సానుకూల దృక్పథంతో మాట్లాడేవారని అన్నారు. రాజకీయంగా తన పురోగతిని ఆకాంక్షించారని, జనసేన పార్టీకి విరాళం ఇచ్చిన మొదటి నాయకుడు ఆయనే అని చెప్పారు. వట్టి వసంతకుమార్ ఆత్మకు శాంతి కలగాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ.. ఆయన కుటుంబసభ్యులకు తన తరఫున, జనసేన పక్షాన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు పవన్ కల్యాణ్ అన్నారు.
మాజీ మంత్రి వట్టి వసంత్కుమార్ ఆదివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. కిడ్నీ మార్పిడితో కొంతకాలంగా అనారోగ్యంగా బాధపడుతున్న ఆయన.. విశాఖపట్నంలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. వసంత్కుమార్ స్వస్థలం పశ్చిమగోదావరి (West Godavari) జిల్లా పూండ్ల. ఉంగుటూరు నియోజకవర్గ ఎమ్మెల్యేగా వసంతకుమార్ పని చేశారు. 2004, 2009లో ఉంగుటూరు నుంచి ఎమ్మెల్యేగా (MLA) ఎన్నికయ్యారు. 2009లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి (YS Rajasekhar Reddy) హయాంలో మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత రోశయ్య (Rosaiah), కిరణ్ కుమార్రెడ్డి (Kiran Kumar Reddy) హయాంలోనూ మంత్రిగా (Minister) బాధ్యతలు నిర్వహించారు.
కాగా.. 2009లో రాజశేఖర్ రెడ్డి క్యాబినెట్లో గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా వసంత్ కుమార్ పనిచేశారు. రోశయ్య క్యాబినెట్లోనూ గ్రామీణాభివృద్ధి మంత్రిగా కొనసాగారు. ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి క్యాబినెట్లో పర్యాటక శాఖ మంత్రిగా పనిచేశారు. టీడీపీ- కాంగ్రెస్ (Telugudesam-Congress) కలయిక తర్వాత హస్తంపార్టీకి ఆయన గుడ్ బై చెప్పేశారు. 2014 నుంచి కాంగ్రెస్ పార్టీతో పాటు.. రాజకీయాలకు కూడా దూరంగా ఉన్నారు.
కాగా వసంత్ కుమార్ మరణంతో ఆయన కుటుంబ సభ్యులు, అభిమానులు, కార్యకర్తలు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. అపోలో ఆస్పత్రికి పెద్ద ఎత్తున అభిమానులు, అనుచరులు చేరుకుంటున్నారు. వసంత్ మృతి పట్ల తెలుగు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ ముఖ్య నేతలు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆయన కుటుంబానికి తమ సానుభూతి తెలుపుతున్నారు. మరికాసేపట్లో.. వట్టి భౌతికకాయాన్ని సొంత గ్రామం పూండ్లకు తరలించేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇవాళ (ఆదివారం) సాయంత్రం పూండ్లలో వసంత్కుమార్ అంత్యక్రియలు జరగనున్నట్లు కుటుంబ సభ్యులు మీడియాకు వెల్లడించారు.