‘హై’ వేగంగా పనులు

ABN , First Publish Date - 2023-02-07T00:32:41+05:30 IST

రాజమహేంద్రవరం నుంచి విజయనగరం జిల్లాకు అల్లూరి సీతారామరాజు జిల్లా మీదుగా రెండు వరుసల జాతీయ రహదారి నిర్మాణ పనులు ప్రస్తుతం జోరుగా జరుగుతున్నాయి.

‘హై’ వేగంగా పనులు
పాడేరు- అరకులోయ మార్గంలో డుంబ్రిగుడ మండలం జాముగుడ వద్ద అందంగా జాతీయ రహదారి

రాజమహేంద్రవరం నుంచి అల్లూరి జిల్లా మీదుగా విజయనగరానికి జాతీయ రహదారి నిర్మాణం

మొత్తం 370 కిలోమీటర్లు

నిర్మాణ అంచనా వ్యయం రూ.1,575 కోట్లు

ప్రస్తుతం చురుగ్గా పాడేరు- అరకులోయ రోడ్డు పనులు

కొయ్యూరు, జీకేవీధి, చింతపల్లి మండలాల్లో భూసేకరణ పనులు

(పాడేరు- ఆంధ్రజ్యోతి)

రాజమహేంద్రవరం నుంచి విజయనగరం జిల్లాకు అల్లూరి సీతారామరాజు జిల్లా మీదుగా రెండు వరుసల జాతీయ రహదారి నిర్మాణ పనులు ప్రస్తుతం జోరుగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా జిల్లాలో కొయ్యూరు మండలం కాకరపాడు నుంచి చింతపల్లి, జి.మాడుగుల, పాడేరు, అరకులోయ, అనంతగిరి మీదుగా విజయనగరం జిల్లా బొడ్డవర వరకు రెండు వరుసల జాతీయ రహదారి నిర్మాణానికి అవసరమైన ఆయా పనులు చేపడుతున్నారు.

తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం నుంచి విజయనగరం వరకు సుమారుగా నాలుగు వందల కిలోమీటర్ల జాతీయ రహదారిని రూ.1,575 కోట్లతో చేపట్టేందుకు కేంద్రం నిధులు మంజూరు చేసింది. ఇందులో భాగంగా ప్రస్తుతం పాడేరు నుంచి హుకుంపేట, డుంబ్రిగుడ మీదుగా అరకులోయ మండలం కొత్తభల్లుగుడ వరకు హైవే రోడ్డు నిర్మాణ పనులు జోరుగా జరుగుతున్నాయి. అలాగే కొయ్యూరు, జీకేవీధి, చింతపల్లి మండలాల్లో హైవే నిర్మాణానికి కేటాయించిన భూ సేకరణ పనులను రెవెన్యూ అధికారులు చేపడుతుండగా, తరువాత జి.మాడుగుల, పాడేరు మండలాల్లో భూ సేకరణ చేపట్టనున్నారు. అరకులోయ మండలం కొత్తభల్లుగుడ నుంచి అనంతగిరి మండలం మీదుగా విజయనగరం జిల్లా బొడ్డవర వరకు భూ సేకరణ చేయాల్సి ఉంది. ఈ మొత్తం 43 కిలోమీటర్లలో సుమారుగా అనంతగిరి మండలంలోని 20 కిలోమీటర్ల రోడ్డు రిజర్వు ఫారెస్ట్‌ పరిధిలో ఉంది. దీంతో కొయ్యూరు, జీకేవీధి, చింతపల్లి, జి.మాడుగుల, పాడేరు మండలాల్లో భూ సేకరణ పూర్తయిన తరువాత అనంతగిరి మండలంపై రెవెన్యూ అధికారులు దృష్టి సారించనున్నారు.

23 అడుగుల నుంచి 74 అడుగులకు..

ఏజెన్సీలో ప్రస్తుతం ఉన్న 23 అడుగుల రోడ్డును 74 అడుగులకు వెడల్పు చేస్తున్నారు. అందులో 34 అడుగులు తారురోడ్డు కాగా, ఇరు వైపులా 20 అడుగుల చొప్పున మట్టి రోడ్డు నిర్మిస్తున్నారు. అలాగే అవసరమైన చోట్ల కల్వర్టులు, వంతెనలు నిర్మిస్తున్నారు. మలుపులను తగ్గిస్తూ రోడ్డు మార్గం నేరుగా ఉండేలా అవసరమైన చోట్ల కొండలను సైతం తొలుస్తున్నారు. దీంతో ప్రస్తుతం పాడేరు నుంచి అరకులోయ వరకు జాతీయ రహదారి నిర్మాణ పనులతో ఆయా మార్గం రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి.

2018లోనే కార్యరూపం

తూర్పుగోదావరి జిల్లా నుంచి విశాఖ ఏజెన్సీ మీదుగా విజయనగరానికి జాతీయ రహదారిని నిర్మించాలనే ప్రతిపాదన 2018లోనే కార్యరూపం దాల్చింది. దీంతో ఏజెన్సీలో కొయ్యూరు నుంచి చింతపల్లి, పాడేరు మీదుగా అరకులోయ వరకు ఉన్న 12 అడుగుల వెడల్పున్న ప్రధాన రహదారిని 23 అడుగుల రహదారిగా ఆర్‌ అండ్‌ బీ అధికారులు విస్తరిస్తే, తరువాత దానిని తాము 74 అడుగుల జాతీయ రహదారిగా అభివృద్ధి చేస్తామని నేషనల్‌ రోడ్స్‌ అథారిటీ అఽధికారులు రాష్ట్రంలోని రోడ్ల, భవనాల శాఖ అధికారులకు సూచించారు. ఇందులో భాగంగానే 2018, 2019 సంవత్సరాల్లో ఏజెన్సీలోని కొయ్యూరు నుంచి పాడేరు, అరకులోయ వరకు ఉన్న రోడ్డును 12 అడుగుల నుంచి 23 అడుగులకు విస్తరించారు. ఆయా రోడ్డు విస్తరణ పనులు పూర్తికావడంతో జాతీయ రహదారి నిర్మాణానికి నేషనల్‌ రోడ్స్‌ అథారిటీ అఽధికారులు 2020లో రంగంలోకి దిగారు. రాజమహేంద్రవరం నుంచి రంపచోడవరం, కాకరపాడు(కొయ్యూరు), లంబసింగి, జి.మాడుగుల, పాడేరు, హుకుంపేట, డుంబ్రిగుడ, అరకులోయ, అనంతగిరి, బొడ్డవర(విజయనగరం జిల్లా) వరకు ఉన్న మొత్తం 370 కిలోమీటర్ల రోడ్డును ఆరు బ్లాక్‌లుగా విభజించారు.

జాతీయ రహదారి ఆరు బ్లాకులు ఇవి..

- రాజమహేంద్రవరం నుంచి రంపచోడవరం 44 కిలోమీటర్లు

- రంపచోడవరం నుంచి కారకపాడు 74 కిలోమీటర్లు

- కాకరపాడు నుంచి లంబసింగి మీదుగా పాడేరు 133 కిలోమీటర్లు

- పాడేరు నుంచి కొత్తభల్లుగుడకు 49 కిలోమీటర్లు

- కొత్తభల్లుగుడ నుంచి బొడ్డవరకు 43 కిలోమీటర్లు

- బొడ్డవర నుంచి విజయనగరం 27 కిలోమీటర్లు

హైవేతో రవాణా వ్యవస్థ మరింత మెరుగు

తూర్పుగోదావరి జిల్లా నుంచి అల్లూరి సీతారామరాజు జిల్లా మీదుగా విజయనగరం జిల్లాను కలుపుతూ జాతీయ రహదారిని నిర్మించడం వల్ల గిరిజన ప్రాంతంలో రవాణా వ్యవస్థ మరింత మెరుగుపడడంతోపాటు అనేక అంశాల్లోనూ అభివృద్ధికి ఆస్కారం ఉంటుందని అందరూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇతర ప్రాంతాల నుంచి ఏజెన్సీ మీదుగా ఒడిశా రాష్ట్రానికి నిత్యం రాకపోకలు సాగుతున్నాయి. అలాగే కొయ్యూరు, లంబసింగి, జి.మాడుగుల, పాడేరు, డుంబ్రిగుడ, అరకులోయ, అనంతగిరి మండలాలు సైతం పర్యాటకంగా దినదినాభివృద్ధి చెందుతున్నాయి. దీంతో ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌, పశ్చిమ బంగా, తెలంగాణ రాష్ట్రాల నుంచి నిత్యం లంబసింగి, పాడేరు, అరకులోయ ప్రాంతాలకు వాహనాల్లో అధిక సంఖ్యలో పర్యాటకులు వస్తున్నారు. జాతీయ రహదారి అందుబాటులోకి వస్తే పర్యాటకంగా, సరకుల రవాణాపరంగా, స్వయం ఉపాధి అవకాశాలు పెరుగుతాయని పలువురు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2023-02-07T00:32:44+05:30 IST