ఘనంగా ‘పార్టిషన్డ్ ఫ్రీడమ్’ పుస్తకావిష్కరణ
ABN , First Publish Date - 2023-01-26T00:17:40+05:30 IST
ఆంధ్రప్రదేశ్ యంగ్ థింకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం పిఠాపురం కాలనీ కళాభారతి ఆడిటోరియంలో పార్టిషన్డ్ ఫ్రీడమ్ పుస్తకావిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఆర్ఎస్ఎస్ జాతీయ కార్యవర్గ సభ్యుడు డాక్టర్ శ్రీరామ్ మాధవ్ ఈ పుస్తకాన్ని రచించారు.
విశాఖపట్నం, జనవరి 25: ఆంధ్రప్రదేశ్ యంగ్ థింకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం పిఠాపురం కాలనీ కళాభారతి ఆడిటోరియంలో పార్టిషన్డ్ ఫ్రీడమ్ పుస్తకావిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఆర్ఎస్ఎస్ జాతీయ కార్యవర్గ సభ్యుడు డాక్టర్ శ్రీరామ్ మాధవ్ ఈ పుస్తకాన్ని రచించారు. ఈ సందర్భంగా మాధవ్ మాట్లాడుతూ దేశవిభజన దుష్ఫలితాలను ఇప్పటికీ అనుభవిస్తున్నామని అన్నారు. 1905లో జరిగిన బెంగాల్ విభజనను దేశ ప్రజలంతా వ్యతిరేకించారని వివరించారు. 1911లో కింగ్జార్జి ఈ విభజనను రద్దు చేశారని, కానీ 1947లో మతం ఆధారంగా దేశం రెండు ముక్కలు అయినా ప్రజలు ఎందుకు మౌనం పాటించారని ప్రశ్నించారు. గాంధీ, జిన్నాలలో కొన్ని పోలికలు ఉన్నాయని అన్నారు. 1920లో కాంగ్రెస్ నుంచి రాజీనామా చేసిన జిన్నా ముస్లింలీగ్ ద్వారా రాజకీయాలు చేశారన్నారు. దేశ స్వాతంత్య్ర సాధనలో కాంగ్రెస్కు మాత్రమే ప్రాచుర్యం లభించిందన్నారు. సెంటర్ ఫర్ పాలసీ స్టడీస్ డైరెక్టర్ ప్రొఫెసర్ ప్రసన్నకుమార్ మాట్లాడుతూ క్రికెట్ జట్టు భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా ఉంటుందన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వానికి ఆర్ఎస్ఎస్ బలమైన పునాది అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్ రాజు, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సుహాసిని ఆనంద్, శాసనమండలి సభ్యులు పీవీఎన్ మాధవ్, ఆర్ఎస్ఎస్ మహానగర్ సంఘ్చాలక పీవీ నారాయణరావు తదితరులు పాల్గొన్నారు.