సచివాలయ ఉద్యోగులపై కలెక్టర్ ఆగ్రహం
ABN , First Publish Date - 2023-02-02T01:26:51+05:30 IST
భూముల విస్తీర్ణం, సబ్డివిజన్లు, సర్వే నంబర్ల వివరాలు తెలియకుండా రెండేళ్ల నుంచి ఉద్యోగాలు ఎలా చేస్తున్నారంటూ మండలంలోని చింతపాక గ్రామ సచివాలయం ఉద్యోగులపై జిల్లా కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మండల సర్వేయర్తోపాటు సచివాలయం అసిస్టెంట్ సర్వేయర్, అసిస్టెంట్ వీఆర్వోలకు షోకాజ్ నోటీసులు జారీచేయాలని తహసీల్దారును ఆదేశించారు.
భూ వివరాలు తెలియకుండా ఉద్యోగాలు ఎలా చేస్తున్నారంటూ అసహనం
మండల సర్వేయర్, అసిస్టెంట్ సర్వేయర్, అసిస్టెంట్ వీఆర్వోలకు షోకాజ్ నోటీసులు
బుచ్చెయ్యపేట, ఫిబ్రవరి 1: భూముల విస్తీర్ణం, సబ్డివిజన్లు, సర్వే నంబర్ల వివరాలు తెలియకుండా రెండేళ్ల నుంచి ఉద్యోగాలు ఎలా చేస్తున్నారంటూ మండలంలోని చింతపాక గ్రామ సచివాలయం ఉద్యోగులపై జిల్లా కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మండల సర్వేయర్తోపాటు సచివాలయం అసిస్టెంట్ సర్వేయర్, అసిస్టెంట్ వీఆర్వోలకు షోకాజ్ నోటీసులు జారీచేయాలని తహసీల్దారును ఆదేశించారు.
జిల్లా కలెక్టర్ రవి పట్టన్శెట్టి బుధవారం చింతపాక గ్రామాన్ని సందర్శించారు. గ్రామ సచివాలయాన్ని తనిఖీ చేసి, భూముల రీసర్వేపై సచివాలయం రెవెన్యూ ఉద్యోగులతో సమీక్షించారు. గ్రామంలో భూమి విస్తీర్ణం ఎంత? ఎన్ని సబ్ డివిజన్లు ఉన్నాయి? ఎన్ని సర్వే నంబర్లు ఉన్నాయి? అని అసిస్టెంట్ సర్వేయర్ వినోద్, అసిస్టెంట్ వీఆర్వో రమణలను ప్రశ్నించారు. వారు వివరాలు చెప్పలేకపోవడంతో కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండేళ్లుగా ఇక్కడ ఉద్యోగాలు చేస్తూ గ్రామంలోని భూముల వివరాలు తెలియకపోవడం ఏమిటంటూ మండిపడ్డారు. మండల సర్వేయర్ సింహాచలం కూడా సరైన వివరాలు చెప్పలేదు. దీంతో ముగ్గురికీ షోకాజ్ నోటీసులు జారీ చేయాలని తహసీల్దార్ ఎస్వీ అంబేడ్కర్ను ఆయన ఆదేశించారు. మండలంలోని అన్ని గ్రామసచివాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులంతా సాయంత్రం తన కార్యాలయంలో సమావేశానికి హాజరయ్యేలే చూడాలని ఎంపీడీఓ సువర్ణరాజును కలెక్టర్ ఆదేశించారు. అంతకుముందు ఉపాధి పనులను పరిశీలించిన ఆయన రోజుకి ఎంత కూలి వస్తున్నదని కూలీలను అడిగారు. కొత్త నిబంధనలతో కూలి బాగా తగ్గిపోయిందని వారు తెలిపారు. అనంతరం అంగన్వాడీ కేంద్రాన్ని తనిఖీ చేశారు. మెనూ ప్రకారం ఆహారం పెడుతున్నారా? అని పిల్లలను ఆరా తీశారు. కలెక్టర్ వెంట సర్పంచ్ గొలజాన శ్రీను, ఏపీఓ మురళీ, ఏఓ భాస్కరరావు, వీఆర్వోలు వున్నారు.