కదంతొక్కిన అంగన్వాడీలు
ABN , First Publish Date - 2023-02-07T00:09:30+05:30 IST
అంగన్వాడీ సిబ్బందికి ఫేస్ యాప్ రద్దు చేయాలని, కనీసం వేతనం రూ. 26 వేలు చెల్లించాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కేఎం శ్రీనివాసరావు, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్కేఎస్వీ కుమార్ డిమాండ్ చేశారు.
సిరిపురం, ఫిబ్రవరి 6 : అంగన్వాడీ సిబ్బందికి ఫేస్ యాప్ రద్దు చేయాలని, కనీసం వేతనం రూ. 26 వేలు చెల్లించాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కేఎం శ్రీనివాసరావు, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్కేఎస్వీ కుమార్ డిమాండ్ చేశారు. సోమవారం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఏపీ అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు అంగన్వాడీలు పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్మికులు ధర్నాకు రాకుండా పోలీసులు అర్ధరాత్రి నాయకుల ఇళ్లకు వెళ్లి నోటీసులు ఇవ్వడం దుర్మార్గమన్నారు. జగన్ ప్రభుత్వం సత్వరమే అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని, లేకపోతే అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు. యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎల్. దేవి మాట్లాడుతూ కార్యకర్త లకు ప్రభుత్వం ఇచ్చిన ఫోన్లు పనిచేయడం లేదన్నారు. కొన్ని కేంద్రాల్లో నెట్ సౌకర్యం లేకపోయినా ఫేస్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలని అధికారులు ఒత్తిడి చేస్తున్నారని తెలిపారు. తక్షణమే ఫేస్ యాప్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం ధర్నా శిబిరానికి వచ్చిన అర్బన్ 2 సీపీడీఓ శ్రీలతకు నాయకులు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ గౌరవ సలహాదారు కె. బృందావతి, పి. మణి, ఆర్. శోభారాణి, పద్మావతి, వెంకటలక్ష్మి, భవాని, బి. ఈశ్వరమ్మ, ఆదిలక్ష్మి, పాపవేణి, ఆర్. ఈశ్వరమ్మ, ఎ. సత్య నాగేశ్వరి, తదితరులు పాల్గొన్నారు.