ప్రై‘వేటు’ దిశగా విశాఖ ఉక్కు

ABN , First Publish Date - 2023-02-07T02:53:53+05:30 IST

రేషనలైజేషన్‌ పేరుతో విశాఖ ఉక్కులో కేంద్ర ప్రభుత్వం వ్యూహాత్మకంగా నిర్ణయాలను అమలు చేస్తోంది.

ప్రై‘వేటు’ దిశగా విశాఖ ఉక్కు

ఖాళీ అవుతున్న కర్మాగారం

దాదాపుగా నిలిచిన నియామకాలు

ఏటా వందల్లో పదవీ విరమణలు

యాజమాన్యం విధానాలు నచ్చక ‘స్వచ్ఛందం’గా మరికొందరు...

మూడేళ్లలో 13ు మేర తగ్గిన ఉద్యోగులు

వ్యూహాత్మక అడుగులకు రేషనలైజేషన్‌ ముసుగు

మండిపడుతున్న కార్మిక, ఉద్యోగ సంఘాలు

(విశాఖపట్నం - ఆంధ్రజ్యోతి)

రేషనలైజేషన్‌ పేరుతో విశాఖ ఉక్కులో కేంద్ర ప్రభుత్వం వ్యూహాత్మకంగా నిర్ణయాలను అమలు చేస్తోంది. ప్రైవేటీకరణను అటు కార్మిక సంఘాలు, ఇటు రాజకీయ పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో పరోక్ష పద్ధతులను ఎంచుకుంది. నోటితో చెప్పకుండా అన్యాపదేశ ఆదేశాలతో ఉద్యోగ నియామక ప్రక్రియను పూర్తిగా నిలిపివేసింది. తద్వారా ప్రైవేటీకరణకు మార్గాన్ని సుగమం చేసుకునే దిశగా అడుగులు వేస్తోంది. స్టీల్‌ ప్లాంట్‌లో ఏటా 200 నుంచి 300 మంది ఎగ్జిక్యూటివ్‌ ట్రైనీలను రిక్రూట్‌ చేయడం ఆనవాయితీ. ఈ ప్రక్రియ ఆగిపోయింది. గత ఏడాది కేవలం ఒక్కరికే విశాఖ ఉక్కులో ఉద్యోగం వచ్చింది. ఇది చాలు ఏ స్థాయిలో నిర్ణయాలు తీసుకున్నారో అర్థం చేసుకోవడానికి. ఒకవైపు ఏటా పదవీ విరమణ చేస్తున్న ఉద్యోగులు... మరోవైపు యాజమాన్యం విధానాలు నచ్చక రాజీనామా చేసి వెళ్లిపోతున్న వారితో కర్మాగారం ఖాళీ అవుతోంది. ఈ ప్రభావం ఉత్పత్తిపై పడుతోంది. అయినా సరే యాజమాన్యం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోంది. మూడేళ్ల క్రితం విశాఖ ఉక్కులో ఎగ్జిక్యూటివ్‌, నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ కలిపి 17,000 మంది ఉద్యోగులు ఉండేవారు. ఇప్పుడు వారి సంఖ్య 14,880కి పడిపోయింది. దాదాపుగా 13 శాతం తగ్గిపోయారు. పార్లమెంటులో కేంద్ర ఉక్కు సహాయ మంత్రి ఫగన్‌ సింగ్‌ కులస్తే సోమవారం వెల్లడించిన వివరాల ప్రకారం... గత మూడేళ్లలో 1,987 మంది పదవీ విరమణ చేశారు. వీరిలో ఎగ్జిక్యూటివ్‌ కేడర్‌ 707 మంది కాగా, నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ కేడర్‌ ఉద్యోగులు 1,280 మంది. గత రెండేళ్లలో ఇక్కడి పరిస్థితులు నచ్చక 237 మంది రాజీనామా చేసి వెళ్లిపోయారు. అంటే గత మూడేళ్లలో 2,200 మంది తగ్గిపోయారు. రాబోయే మూడేళ్లలో... అంటే 2025 నాటికి 3,209 మంది పదవీ విరమణ చేయనున్నారు. ప్రస్తుతం 14,880 మంది ఉండగా, మూడేళ్ల తరువాత వారి సంఖ్య 11,500కి తగ్గిపోనుంది. మరోవైపు నియామక ప్రక్రియ చూస్తే గత మూడేళ్లలో... 2020, 2021, 2022లలో కేవలం 106 మందిని మాత్రమే తీసుకున్నారు. వెళ్లిపోతున్న వారి సంఖ్యకు, కొత్తగా వస్తున్న వారి సంఖ్యకు పొంతన లేదు. కర్మాగారాన్ని ప్రైవేటు సంస్థలకు విక్రయించాలని యోచిస్తున్నందున... వీలైనంత వరకు ఉద్యోగుల సంఖ్య తగ్గించడానికే ఇలా చేస్తున్నారని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఎగ్జిక్యూటివ్‌ అధికారుల సంఘం అయితే... ‘పొమ్మనకుండా పొగ పెడుతున్నారు’ అని విమర్శిస్తోంది.

‘నో ఫ్రీజింగ్‌’... కేంద్ర మంత్రి

పార్లమెంటులో విశాఖ ఉక్కుపై ఎంపీలు ప్రశ్నించగా, ఉక్కు శాఖ సహాయ మంత్రి ఫగన్‌ సింగ్‌ కులస్తే సమాధానమిస్తూ... ‘‘నియాకాలపై ఎటువంటి ఫ్రీజింగ్‌ లేదు. రేషనలైజేషన్‌ ప్రకారం ముందుకు వెళుతున్నాం. ఉత్పత్తేతర వ్యవహారాల్లో అవుట్‌ సోర్సింగ్‌ నియామకాలు చేస్తూ, మిగిలిన వారిని సర్దుబాటు చేస్తున్నాం’’ అని వెల్లడించారు.

Updated Date - 2023-02-07T02:53:54+05:30 IST