ఆలస్యం.. రాంత్రంతా జాగారం
ABN , First Publish Date - 2023-01-25T00:49:21+05:30 IST
ఉపాధ్యాయుల సర్దుబాటు కౌన్సెలింగ్ మంగళవారం ఆలస్యంగా మొదలైంది. సర్టిఫికెట్ల పరిశీలన అనంతరం రాత్రికి కౌన్సెలింగ్ ప్రారంభమైంది. దీంతో ఉపాధ్యాయులు ఇబ్బందులు పడ్డారు.
గందరగోళంగా టీచర్ల సర్దుబాటు కౌన్సెలింగ్
ఒంగోలు (విద్య), జనవరి 24 : ఉపాధ్యాయుల సర్దుబాటు కౌన్సెలింగ్ మంగళవారం ఆలస్యంగా మొదలైంది. సర్టిఫికెట్ల పరిశీలన అనంతరం రాత్రికి కౌన్సెలింగ్ ప్రారంభమైంది. దీంతో ఉపాధ్యాయులు ఇబ్బందులు పడ్డారు. ఉదయం సీనియారిటీ జాబితాలోని ఉపాధ్యాయుల సర్టిఫికెట్ల పరిశీలన పూర్తిచేసి మధ్యాహ్నం నుంచి కౌన్సెలింగ్ నిర్వహించి ఖాళీ స్థానాల్లో టీచర్లను సర్దుబాటు చేస్తామని అధికారులు ప్రకటించారు. అయితే స్థానిక డీఆర్ఆర్ఎం హైస్కూల్లో సర్టిఫికెట్ల పరిశీలన సాయంత్రానికి కాని పూర్తికాలేదు. దీంతో ఆ ప్రక్రియ పూర్తయిన తర్వాత కౌన్సెలింగ్కు అంగీకారం తెలిపిన వారి సీనియారిటీ జాబితాలను తయారుచేసి రాత్రి 8 గంటలకు అధికారులు సర్దుబాటు కౌన్సెలింగ్ను ప్రారంభించారు. హైస్కూళ్లు, యూపీ స్కూళ్లలోని సబ్జెక్ట్ టీచర్ల పోస్టుల్లో అర్హత ఉన్న సీనియర్ సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులను సర్దుబాటు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. వీరికి జీతభత్యాలకు అదనంగా రూ.2,500 అలవెన్స్ కూడా ఇస్తారు. ఇంగ్టిష్, గణితం, బయోలాజికల్ సైన్సు, సోషల్ స్టడీస్ సబ్జెక్ట్ టీచర్లను సర్దుబాటు చేసేందుకు ఈనెల 14న, 18న రెండుసార్లు కౌన్సెలింగ్ నిర్వహించారు. మిగిలిపోయిన స్థానాలకు మంగళవారం కౌన్సెలింగ్ చేపట్టారు. ప్రస్తుత కౌన్సెలింగ్లో కూడా ఈ ఖాళీలు భర్తీ అయ్యే పరిస్థితి కనిపించలేదు. మొదటగా రాత్రి 8 గంటలకు బయోలాజికల్ సైన్స్ కౌన్సెలింగ్ మొదలైంది. ఈ సబ్జెక్ట్లో 49 ఖాళీ పోస్టులు ఉండగా 40 మంది అభ్యర్థులు మాత్రమే హైస్కూళ్లు, యూపీ స్కూళ్లలో సబ్జెక్ట్ టీచర్లుగా పనిచేసేందుకు అంగీకారం తెలిపారు. వారిలో కూడా తమకు అనుకూలమైన స్థానాలు కౌన్సెలింగ్లో లభించకపోతే అక్కడైనా ఉద్యోగోన్నతి తిరస్కరిస్తామని చెప్తున్నారు .