Nellore Political War: నెల్లూరు గడ్డ.. తిరుగుబాట్ల అడ్డా!
ABN , First Publish Date - 2023-02-07T03:23:17+05:30 IST
ఆత్మాభిమానం దెబ్బతీసే పరిస్థితులు ఎదురైనప్పుడు తిరుగుబాటు చేయడం నెల్లూరు జిల్లా ప్రత్యేకం.
ఆనం సుబ్బారెడ్డి నుంచి నల్లపరెడ్డి శ్రీనివాసులురెడ్డి దాకా
1965-89 మధ్య నాయకత్వాలపై తిరుగుబాట్లు
మళ్లీ 3 దశాబ్దాల తర్వాత ఇప్పుడు!
జగన్ సర్కారుపై గళమెత్తిన రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి
(నెల్లూరు-ఆంధ్రజ్యోతి)
ఆత్మాభిమానం దెబ్బతీసే పరిస్థితులు ఎదురైనప్పుడు తిరుగుబాటు చేయడం నెల్లూరు జిల్లా ప్రత్యేకం. అందుకు కారకులెవరైనా.. వారెంతటివారైనా.. చివరకు రాజకీయంగా జీవితం ఇచ్చినవారైనా సరే.. తిరగబడి ఎదురు నిలవడం ఈ జిల్లా నేతల నైజం. ఒకసారి ఇక్కడి రాజకీయాలను పరిశీలిస్తే.. 1960వ దశకం నుంచే తిరుగుబాట్లు కనిపిస్తాయి. 1965 నుంచి 1989 వరకు పలు సందర్భాల్లో పలువురు నాయకులు అగ్రనాయకుల మీద తిరుగుబాటు జెండా ఎగురవేశారు. దాదాపు మూడు దశాబ్దాల తరువాత మళ్లీ ఇప్పుడు అదే పరిస్థితి కనిపిస్తోంది. మొన్నటివరకు కాంగ్రెస్, టీడీపీ ఈ తిరుగుబాట్ల ప్రభావాన్ని చవిచూడగా.. తాజాగా అధికార వైసీపీ ఆ పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఇద్దరు ఎమ్మెల్యేల వ్యతిరేకతను ఎలా ఎదుర్కొవాలో తెలియక విలవిలలాడుతోంది.
1952లో గోపాల్రెడ్డిపై తిరుగుబాటు
నెల్లూరు జిల్లా ప్రముఖ రాజకీయ నాయకుల్లో తొలుత చెప్పే పేరు బెజవాడ గోపాల్రెడ్డి(బెగోరె). ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో తిరుగులేని నాయకుడిగా, ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి (1955-56)గా పనిచేసిన ఈయనకు.. 1952 ఎన్నికల్లో ఉదయగిరిలో కాంగ్రెస్ నాయకుల నుంచే తిరుగుబాటు ఎదురైంది. ఆయన నాయకత్వాన్ని దెబ్బతీసేందుకు ఆనం చెంచు(ఏసీ)సుబ్బారెడ్డి.. కోవి రామయ్య చౌదరి అనే నాయకుడిని బరిలోకి దించి ఓడించారు. ప్రతీకారంగా గోపాల్రెడ్డి అదే నెల్లూరులో ఏసీ సుబ్బారెడ్డిని కందవల్లి కృష్ణారావు అనే ఇండిపెండెంట్ను నిలిపి ఓడించారు. అప్పట్లో ఇది పెద్ద రాజకీయ కుట్రగా చర్చకు దారితీసింది.
1965లో ఆనంకు చుక్కెదురు!
నెల్లూరు జిల్లాపై అప్పట్లో ఆనం కుటుంబ పెత్తనం సాగేది. నీలం సంజీవరెడ్డి కేబినెట్లో ఏసీ సుబ్బారెడ్డి మంత్రిగా ఉండేవారు. జిల్లాలో ఆయన మాటే శాసనం. కేబినెట్లో సైతం ఈయనకు పట్టుండేది. ఎదురు నిలబడి మాట్లాడేవారే లేరు. ఈయన సహకారంతో నల్లపరెడ్డి చంద్రశేఖర్రెడ్డి ఆ రోజుల్లో జిల్లా పరిషత్ చైర్మన్గా ఎన్నికయ్యారు. కొంతకాలం ఇద్దరు కలిసే ఉన్నారు. అయితే 1965 డిసెంబరులో ఏసీ సుబ్బారెడ్డి నాయకత్వాన్ని చంద్రశేఖర్రెడ్డి ప్రశ్నించారు. దీంతో సుబ్బారెడ్డి ఆదేశాలతో జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్న ఆయనపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. కానీ నల్లపరెడ్డి చంద్రశేఖర్రెడ్డికి సంపూర్ణ మద్దతుతో విజయం సాధించారు. ఇది రాష్ట్ర రాజకీయాల్లో ఓ సంచలనం సృష్టించింది. తొలిసారిగా రాష్ట్ర కాంగ్రెస్ అంతర్గత తిరుగుబాటును చవిచూసింది. ఈ మొత్తం ఎపిసోడ్లో చంద్రశేఖర్రెడ్డికి ముఖ్యమంత్రి సంజీవరెడ్డి ఆశీస్సులు, అండదండలు అందాయని అప్పట్లో ప్రచారం జరిగింది. ఈ తిరుగుబాటు తర్వాత జిల్లాలో రాజకీయ సమీకరణలు పూర్తిగా మారిపోయాయి. దక్షిణ నెల్లూరులో ఆనం ప్రభావం గణనీయంగా తగ్గిపోయింది. గూడూరు డివిజన్ పూర్తిగా నల్లపరెడ్డి వశమైంది. చంద్రశేఖర్రెడ్డికి రాష్ట్ర వ్యాప్తంగా విప్లవవీరుడు అనే పేరు వచ్చింది.
1972లో పీవీపై..
అప్పట్లో గూడూరు డివిజన్ మొత్తం నల్లపరెడ్డి శ్రీనివాసులురెడ్డి పెత్తనం కింద నడిచేది. నేదురుమల్లి జనార్దన్రెడ్డి కూడా నల్లపరెడ్డి అనుచరుడిగా ఉండేవారు. 1972 ఎన్నికల్లో శ్రీనివాసులురెడ్డికి కాంగ్రెస్ అధిష్ఠానం షాకిచ్చింది. అప్పటి ముఖ్యమంత్రి పీవీ నరసింహారావు ఆయనకు గూడూరు టికెట్ ఇవ్వకుండా శారదాంబ అనే మహిళకు ఇచ్చారు. దీంతో కాంగ్రెస్ అధిష్ఠానంపై శ్రీనివాసులురెడ్డి తిరుగుబాటు చేశారు. ఇండిపెండెంట్గా పోటీచేసి విజయం సాధించారు. అయితే ఈ ఎన్నికల్లో నేదురుమల్లి.. నల్లపరెడ్డి కుటుంబాన్ని కాదని పీవీ పక్షాన నిలిచారు. దాంతో పీవీ ఆయన్ను రాజ్యసభకు పంపారు. అలా నేదురుమల్లి రాజకీయ శకం ఆరంభమైంది.
1989లో ఎన్టీఆర్పై..
నల్లపరెడ్డి శ్రీనివాసులురెడ్డి ఎన్టీఆర్ కేబినెట్లో మంత్రిగా ఉన్నారు. అప్పట్లో టీడీపీలో ఆయన్ను నంబర్-2గా భావించేవారు. 1989 ప్రాంతంలో ఎన్టీఆర్ ఒక ప్రభుత్వ కార్యక్రమం నిమిత్తం శ్రీనివాసులురెడ్డి స్వస్థలమైన కోటకు వచ్చారు. సభా ప్రాంగణంలో ఒక పాత్రికేయుడు ఎన్టీఆర్కు ఒక చిన్న కాగితం ముక్క ఇచ్చారు. కోటలో జరుగుతున్న ఒక చెరువు పనిలో అవినీతి జరిగిందని రాశారు. దీన్ని చదివిన ఎన్టీఆర్ ఆగ్రహించారు. కార్యక్రమం కాగానే నేరుగా చెరువు పని పరిశీలనకు వెళ్లారు. ఆ తర్వాత ఉదయగిరిలో విలేకరుల సమావేశం పెట్టి చెరువు పనుల్లో అవినీతిపై ఆవేశంగా మాట్లాడారు. దీనిని శ్రీనివాసులురెడ్డి అవమానంగా భావించారు. కొద్దికాలానికే మంత్రి పదవికి రాజీనామా చేసి ఎన్టీఆర్కు వ్యతిరేకంగా ప్రచారం మొదలుపెట్టారు. శీనయ్యసేన అనే పేరుతో రాష్ట్రమంతా పర్యటించారు. 1989 అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్టీఆర్ ఓటమికి కృషిచేశారు.
ఇన్నాళ్లకు మళ్లీ..
సుమారు మూడు దశాబ్దాల అనంతరం మళ్లీ ఇప్పుడు నెల్లూరు జిల్లా రాష్ట్ర ప్రజలను ఆకర్షించింది. అధికార పార్టీలో ఉంటూ అధినాయకత్వం తీరుపై ఇద్దరు సిటింగ్ ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేయడం సంచలనం సృష్టిస్తోంది. ప్రజా సమస్యలపై ప్రశ్నించినందుకు పొగపెట్టడంతో ఏసీ సుబ్బారెడ్డి సోదరుడు వెంకటరెడ్డి కుమారుడైన మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి.. జగన్ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. తన ఫోన్ ట్యాపింగ్ చేశారనే ఆవేదనతో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి కూడా వైసీపీ నుంచి నిష్కమిస్తున్నట్లు సంచలన ప్రకటన చేశారు. ఈ ఇద్దరూ సీఎంపైన, ప్రభుత్వ పెద్దలపైన తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తుండడంతో వారం రోజులుగా నెల్లూరు జిల్లా రాజకీయాలో సందడిగా మారాయి.