శాటిలైట్ స్టేషన్గా గుణదల
ABN , First Publish Date - 2023-01-25T00:42:31+05:30 IST
శాటిలైట్ రైల్వేస్టేషన్గా గుణదలను అభివృద్ధి చేయాలని రైల్వే ఉన్నతాధికారులు భావిస్తున్నారు.
పలు రైళ్ల మళ్లింపునకు సన్నాహాలు
(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : శాటిలైట్ రైల్వేస్టేషన్గా గుణదలను అభివృద్ధి చేయాలని రైల్వే ఉన్నతాధికారులు భావిస్తున్నారు. పలు ముఖ్యమైన రైళ్లను గుణదల స్టేషన్లో నిలుపుదల చేయటానికి రంగం సిద్ధం చేస్తున్నారు. గుణదల స్టేషన్లో నిలిచే రైళ్లు విజయవాడ స్టేషన్లో ఆగవు. గుణదలను శాటిలైట్ స్టేషన్ చేయాలని ఎప్పటినుంచో డిమాండ్ ఉంది. అయినప్పటికీ గత రైల్వే అధికారులు గుణదలను కాదని రాయనపాడు రైల్వేస్టేషన్ను శాటిలైట్ స్టేషన్గా అభివృద్ధి చేశారు. రాయనపాడును శాటిలైట్ రైల్వేస్టేషన్గా అభివృద్ధి పరిచిన నేపథ్యంలో, అక్కడి నుంచి ప్రయాణికులు తిరిగి విజయవాడ రావటానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు. దూరాభారం కావటంతో సౌకర్యం సంగతి అటుంచితే ప్రయాణికులకు ఇబ్బందులు తప్పట్లేదు. ప్రయాణికుల నుంచి రైల్వే ఉన్నతాధికారులకు తరచూ ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో రైల్వే అధికారులు గుణదల రైల్వేస్టేషన్పై దృష్టి సారించారు. గుణదలను శాటిలైట్ స్టేషన్గా అభివృద్ధి చేసి పలు రైళ్లు ఇక్కడి నుంచే రాకపోకలు సాగించేలా కసరత్తు చేస్తున్నారు. కృష్ణా పుష్కరాల సందర్భంలో గుణదల రైల్వేస్టేషన్ను అభివృద్ధి చేశారు. శాటిలైట్గా తీర్చిదిద్దాలంటే మరికొంత అభివృద్ధి చేయాల్సి ఉంది. ప్రధాన మార్గాన్ని అభివృద్ధి చేస్తే వాహనాలు రాకపోకలు సాగించటానికి వీలవుతుంది. స్థానిక సంస్థల భాగస్వామ్యంతో ప్రధాన మార్గం అభివృద్ధికి చొరవ తీసుకోవాలని రైల్వే అధికారులు భావిస్తున్నారు.