స్వపక్షంలో విపక్షం!
ABN , First Publish Date - 2023-02-07T00:45:08+05:30 IST
మైలవరం వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ను పార్టీ నుంచి సాగనంపే ప్రయత్నాలు జరుగుతున్నాయా? పార్టీ నుంచి పొమ్మనకుండా పొగబెడుతున్నారా? గతకొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తే పై ప్రశ్నలకు ఔననే సమాధానమే వస్తోంది. మంత్రి జోగి రమేశ్ తిరిగి మైలవరం నియోజకవర్గం నుంచి పోటీ చేసే ఆలోచనతోపాటు, వైసీపీ పెద్దలను దానికి అనుగుణంగా ఒప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు. తనకు మైలవరంలో లైన్ క్లియర్ చేసుకోవడంలో భాగంగా సిట్టింగ్ ఎమ్మెల్యే కృష్ణప్రసాద్(కేపీ)ను లక్ష్యంగా చేసుకుని తన అనుచరులతో పొగపెట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
మైలవరం వైసీపీలో రణం
ఎమ్మెల్యే అక్రమాలే లక్ష్యంగా మంత్రి పావులు
కేపీ బూడిద లారీలు అడ్డుకున్న జోగి అనుచరుడు
కేపీపై బూతుపురాణం.. గతంలోనూ ఇదే తరహా వ్యూహం
కేపీని పొమ్మనకుండా పొగబెడుతున్న వైసీపీ అధిష్ఠానం
మైలవరం వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ను పార్టీ నుంచి సాగనంపే ప్రయత్నాలు జరుగుతున్నాయా? పార్టీ నుంచి పొమ్మనకుండా పొగబెడుతున్నారా? గతకొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తే పై ప్రశ్నలకు ఔననే సమాధానమే వస్తోంది. మంత్రి జోగి రమేశ్ తిరిగి మైలవరం నియోజకవర్గం నుంచి పోటీ చేసే ఆలోచనతోపాటు, వైసీపీ పెద్దలను దానికి అనుగుణంగా ఒప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు. తనకు మైలవరంలో లైన్ క్లియర్ చేసుకోవడంలో భాగంగా సిట్టింగ్ ఎమ్మెల్యే కృష్ణప్రసాద్(కేపీ)ను లక్ష్యంగా చేసుకుని తన అనుచరులతో పొగపెట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
(విజయవాడ - ఆంధ్రజ్యోతి)
కేపీ బూడిద లారీలు అడ్డుకున్న జోగి అనుచరుడు
ఇబ్రహీంపట్నం థర్మల్ స్టేషన్ నుంచి కేపీ అనుచరులు పెద్దఎత్తున బూడిద అక్రమంగా తరలించుకుపోతున్నారన్న ఆరోపణలున్నాయి. వేరే వారికి అవకాశం ఇవ్వకుండా కేవలం కేపీ మనుషులే ఈ బూడిద తరలింపు చేస్తున్నారు. దీంతో జోగి అనుచరులు బూడిద రవాణాపై దృష్టి పెట్టారు. అందులో భాగంగా మూడు రోజుల క్రితం వైసీపీ మండల కన్వీనర్ నల్లమోతు శివనాగేశ్వరరావు బూడిద లారీలను అడ్డుకుని కేపీపై బూతులు లంకించుకున్నారు. శివనాగేశ్వరరావు ఒకప్పుడు కేపీకి అనుచరుడు. ఎప్పుడైతే జోగి రమేశ్ మైలవరంపై దృష్టి సారించారో అప్పటి నుంచి జోగి వర్గంలోకి ఫిరాయించారు. గతంలో కూడా కేపీ అనుచరులు సాగిస్తున్న మట్టి అక్రమ రవాణా.. గ్రావెల్ తవ్వకాలే లక్ష్యంగా జోగి అనుచరులు పలుమార్లు అడ్డుకోవడం.. అధికారుల దృష్టికి తీసుకెళ్లడం చేశారు.
పొమ్మనకుండా పొగబెడుతున్నారా...
మైలవరం నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్పై వైసీపీ పెద్దలు పెద్దగా సానుకూలంగా లేరన్న ప్రచారం నియోజకవర్గంలో జరుగుతోంది. కొద్దిరోజుల క్రితం మైలవరం నియోజకవర్గ నాయకులతో సీఎం జగన్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ కూడా పాల్గొన్నారు. మైలవరంలో వైసీపీని తిరిగి గెలిపించుకుని రావాలని నాయకులను కోరారు. నియోజకవర్గంలో గత ఎన్నికల్లో వచ్చిన మెజార్టీ కంటే ఈసారి ఎన్నికల్లో ఎక్కువ రావాలని ఆదేశించారు. నియోజకవర్గ సమీక్ష సందర్భంగా సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలను అటు వసంత వర్గం ఇటు జోగి వర్గం ఎవరికి వారు తమకు ఇష్టమొచ్చిన విధంగా అన్వయించుకున్నారు. ఇతర నియోజకవర్గ సమీక్షల్లో సీఎం నేరుగా ఫలాన అభ్యర్థి అంటూ పేరు చెప్పి ఆ అభ్యర్థిని గెలిపించుకురావాలని వ్యాఖ్యానించారని, కానీ మైలవరం విషయానికి వచ్చేసరికి పార్టీ పేరు ప్రస్తావించారని అంటే వసంత కృష్ణ ప్రసాద్కు ఈసారి టికెట్ దక్కనట్టేనని జోగి రమేశ్ వర్గం ప్రచారం చేసింది. కృష్ణ ప్రసాద్ అక్రమాలు. ఆయన తండ్రి వసంత నాగేశ్వరరావు.. కమ్మ సామాజికవర్గానికి వైసీపీ హయాంలో అన్యాయం జరిగిపోతోందన్నట్టు మాట్లాడిన మాటలు అధిష్ఠానం దృష్టిలో ఉన్నాయని అందుకే మైలవరం విషయంలో జగన్ నిక్కచ్చిగా ఉన్నారని జోగి వర్గం ప్రచారం చేసింది. వీటీపీఎస్లో బూడిద దోపిడీ నుంచి కొండపల్లి అడవుల్లో అక్రమ క్వారీయింగ్, ఇసుక దోపిడీ వంటివన్నీ వసంత కృష్ణప్రసాద్ పట్ల నియోజకవర్గ ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతను తీసుకొచ్చాయని, ఆయనకు టికెట్ ఇస్తే ఈసారి పార్టీకి ఓటమి తప్పదని, అందుకే జగన్ అభ్యర్థిని మార్చే యోచనలో ఉన్నారని జోగి వర్గం చెబుతున్న మాట. ఈ ప్రచారానికి బలం చేకూర్చేలా నియోజకవర్గంలో కేపీని ఆయన మనుషులను లక్ష్యంగా చేసుకుని ఎదురుదాడి జరుగుతోంది. దీంతో కేపీని పార్టీ నుంచి సాగనంపేందుకే వైసీపీ పెద్దలు ఇలా వ్యవహరిస్తున్నారన్న అనుమానం కేపీ వర్గంలో వ్యక్తమవుతోంది. సీఎంతో సమావేశం జరిగిన సమయంలో.. మైలవరం నియోజకవర్గంలో విభేదాల పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని సీఎం చెప్పినట్టు వసంత కృష్ణ ప్రసాద్ విలేకరులకు తెలిపారు. వారం పదిరోజుల్లో మైలవరం నియోజకవర్గ నేతలతో మరోసారి సమావేశమవుతానని, ఆ సమావేశానికి తనతోపాటు మంత్రి జోగి రమేశ్ను పిలిచి చర్చిస్తానని జగన్ చెప్పినట్టు కృష్ణప్రసాద్ వెల్లడించారు. కానీ నెల రోజులు అవుతున్నా అలాంటి కార్యక్రమం ఏదీ జరగకపోగా.. కేపీపై జోగి అనుచరుల దాడి రోజురోజుకీ ఉధృతమవుతోంది.