ఆధార్ కార్డులో ఎన్టీఆర్ జిల్లాగా మార్చుకోండి
ABN , First Publish Date - 2023-02-07T01:20:44+05:30 IST
ఆధార్ కార్డుల నవీకరణకు ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం శ్రీకారం చుట్టింది. అతి త్వరలో నవీకరణ షెడ్యూల్ను ప్రకటించబోతోంది.
నవీకరణకు త్వరలో షెడ్యూల్ ప్రకటన
2010-16 మధ్య ఆధార్ పొందిన వారికి నవీకరణ
5- 7, 15 - 17 సంవత్సరాల వయస్సుల వారికి ఉచితం
(ఆంధ్రజ్యోతి, విజయవాడ): ఆధార్ కార్డుల నవీకరణకు ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం శ్రీకారం చుట్టింది. అతి త్వరలో నవీకరణ షెడ్యూల్ను ప్రకటించబోతోంది. ఆధార్కార్డులను 2010-16 మధ్య కాలంలో పొందినవారికి ఈ నవీకరణ వర్తిస్తుంది. జిల్లా కలెక్టర్ దిల్లీరావు చొరవతో జిల్లాల పునర్విభజనలో భాగంగా ఉమ్మడి కృష్ణాజిల్లా విడివడిన నేపథ్యంలో ఎన్టీఆర్ జిల్లా పరిధిలోకి వచ్చేవారంతా .. తమ జిల్లాను ఎన్టీఆర్ జిల్లాగా పేరు మార్చుకునే అవకాశాన్ని కూడా ఈ నవీకరణలో కల్పించారు. పాత కృష్ణాజిల్లా పేరుతో ఆధార్ కార్డులు ఉన్న వారంతా ఎన్టీఆర్ జిల్లాగా పేరు మార్చించుకోవటానికి అవ కాశం కలుగుతోంది. జిల్లా మార్పు కారణంగా భవిష్యత్తులో ఏ సమస్యలు, ఇబ్బందులు రాకుండా ఉండే అవకాశం ఉంది. నిన్న మొన్నటి వరకు ఆధార్లో జిల్లా పేరును మార్చుకోవ డానికి అవకాశం లేదు. జిల్లా యంత్రాంగం యూఐడీఏఐ అధి కారుల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేసింది.
జిల్లా స్థాయి కమిటీ ఏర్పాటు
ఆధార్ కార్డుల నవీకరణకు తీసుకోవాల్సిన చర్యలపై ఇటీవలే కలెక్టర్ దిల్లీరావు సంబంధిత శాఖలతో సమీక్ష నిర్వ హించారు. జిల్లాస్థాయి కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమి టీలో నగర పోలీసు కమిషనర్, లీడ్ బ్యాంక్ మేనేజర్, జిల్లా రెవెన్యూ అధికారి, డ్వామా పీడీ, డీఆర్డీఏ పీడీ తదితర జిల్లా అధికారులను సభ్యులుగా కలెక్టర్ నియమించారు. ఆధార్ నవీ కరణపై ప్రతి మూడు నెలలకోసారి జిల్లా స్థాయి పర్యవేక్షణ కమిటీ సమీక్షిస్తుంది. నవీకరణలో భాగంగా 5 నుంచి 7, 15 నుంచి 17 సంవత్సరాల వారికి ఉచితంగా సేవలు అందించనున్నారు. రుసుము చెల్లించకుండా ఉచితంగా ఆధార్ను అప్డేట్ చేసుకోవచ్చు. జిల్లాల విభజనలో భాగంగా కృష్ణాజిల్లా నుంచి విడివడి నూతన ఎన్టీఆర్ జిల్లా పరిధిలోకి వచ్చిన వారు ఆధార్ కార్డు లలో ఇంకా కృష్ణా జిల్లా పేరు ఉండటం వల్ల పలు సమస్యలను ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వ పథ కాలు, విద్యార్థుల స్కాలర్షిప్పులు, బ్యాంకు ఖాతాలు, ఐటీ రిటర్న్ల విషయంలో స్వల్ప ఇబ్బందులు ఎదురౌతున్నాయి. ఈ సేవలన్నింటినీ ఆధార్ ఆధారితంగానే నిర్వహించాల్సి ఉం టుంది. కేంద్ర ప్రభుత్వం వన్ నేషన్ వన్ రేషన్ కార్యక్ర మంలో భాగంగా ఆధార్ అనుసంధానం ద్వారానే దేశంలో ఎక్కడైనా కార్డుదారుడు రేషన్ తీసుకునే వ్యవస్థ అందు బాటులోకి వచ్చింది. ఎక్కడైనా రేషన్ తీసుకోవాలంటే .. ఆధార్ నవీకరణ తప్పనిసరి. కాబట్టి ఇన్ని అవసరాలున్న ఆధార్ కార్డును మరింత సమర్థవంతంగా చేయాలన్నా.. సులభతరమైన సేవలు అందుకోవాలన్నా చిరునామా, బయో మెట్రిక్, ఐరిస్ వంటివి నిర్ణీత కాలవ్యవధిలో నవీకరణ చేసు కోవాల్సి ఉంటుంది.
సందేహాల నివృత్తికి టోల్ఫ్రీ
నవీకరణ ప్రక్రియపై సందేహాలు ఉంటే వాటిని నివృత్తిని చేసేందుకు ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం 1947 టోల్ఫ్రీని ఏర్పాటు చేసింది. పోస్టాఫీసులు, బ్యాంకులు, పలుచోట్ల గ్రామ సచివాలయాలలో ఆధార్ సేవా కేంద్రాలు ఉన్నాయి. కొన్ని ప్రైవేటు ఆధార్ అధీకృత కేంద్రాలు ఉన్నాయి. ఎక్కడ అప్డేట్ చేసుకోవాలి? ఎలా నవీకరణ చేసుకోవాలి ? వంటి వివరాలను షెడ్యూల్లో ఇస్తారు. వలంటీర్ల ద్వారా ఆధార్ కార్డుదారులకు సమాచారాన్ని అందించటానికి జిల్లా యంత్రాంగం సన్నా హాలు చేస్తోంది.