మల్బరీకి టమోటా దెబ్బ

ABN , First Publish Date - 2023-02-01T23:19:18+05:30 IST

రాష్ట్రంలోనే హిందూపురం తరువాత పట్టుగూళ్ల విక్రయానికి పేరుమోసిన మదనపల్లె ప్రభుత్వ పట్టుగూళ్ల మార్కెట్‌ విక్రయాలకు పట్టుగూళ్లు రాక బోసిపోతోంది. ఒకప్పుడు నిత్యం 5 టన్నుల పట్టుగూళ్లు విక్రయానికి వస్తుండగా నేడు సరాసరిన కేవలం 300 నుంచి 500 కిలోల పట్టుగూళ్లు మాత్రమే విక్రయానికి వస్తుండటంతో మార్కెట్‌ బోసిపోతోంది.

మల్బరీకి టమోటా దెబ్బ
గూళ్లు రాక బోసిపోతున్న మదనపల్లె పట్టుగూళ్ల మార్కెట్‌

తగ్గిపోతున్న దిగుబడి

బోసిపోతున్న పట్టుగూళ్ల మార్కెట్‌

మదనపల్లె టౌన్‌, ఫిబ్రవరి 1: రాష్ట్రంలోనే హిందూపురం తరువాత పట్టుగూళ్ల విక్రయానికి పేరుమోసిన మదనపల్లె ప్రభుత్వ పట్టుగూళ్ల మార్కెట్‌ విక్రయాలకు పట్టుగూళ్లు రాక బోసిపోతోంది. ఒకప్పుడు నిత్యం 5 టన్నుల పట్టుగూళ్లు విక్రయానికి వస్తుండగా నేడు సరాసరిన కేవలం 300 నుంచి 500 కిలోల పట్టుగూళ్లు మాత్రమే విక్రయానికి వస్తుండటంతో మార్కెట్‌ బోసిపోతోంది.

టమోటా పంటతో దెబ్బ

జిల్లాలోని పడమటి ప్రాంతాల్లో రైతులు వాణిజ్య పంట అయిన టమోటాను అధికంగా సాగు చేస్తున్నారు. ఈ టమోటా పంటకు ఎక్కువగా పురుగు మందులు అధిక మోతాదులో వాడుతున్నారు. ఎక్కడైతే టమోటా పంట సాగు అవుతోందో ఆ ప్రాంతం చుట్టుపక్కల మల్బరీ పంట సాగు చేసిన రైతులకు ఎదురుదెబ్బ తగులుతోంది. పురుగుమందులు పిచికారి చేయడం వలన అవి వాతావరణంలో కలసిపోయి పట్టు పురుగులు పెంచుతున్న షెడ్లలోకి చొరబడి పట్టు పురుగులు చనిపోతున్నాయని రైతులు వాపోతున్నారు. దీంతో మల్బరీ పంటకు టమోటా పంటతో ఎదురుదెబ్బ తగులుతోంది. దీంతో ఒకప్పుడు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 30 వేల ఎకరాలకు దాకా మల్బరీ సాగు ఉండగా ఇప్పుడు 9 వేల ఎకరాలకు పడిపోయింది.

రైతులేమో సీబీ రకం సాగు.. రీలర్లేమో బీవీ కోసం డిమాండ్‌

మదనపల్లె ప్రాంతంలో మల్బరీ రైతులు ఎక్కువగా క్రాస్‌ బ్రీడ్‌ (సీబీ రకం) పట్టుగూళ్లను పెంచుతున్నారు. డివిజన్‌లోని 15 మండలాలకు గాను ఒక్క రామసముద్రం మండలం తప్ప మిగిలిన 14 మండలాల్లో సీబీ రకం గూళ్లను రైతులు ఉత్పత్తి చేస్తున్నారు. ఈ సీబీ రకం గూళ్లకు కర్ణాటక రాష్ట్రం శిడ్లఘట్టలో డిమాండ్‌ ఎక్కువగా ఉండటంతో ఇక్కడి రైతులు కర్ణాటక మార్కెట్‌కు వెళుతున్నారు. కాగా మదనపల్లెలో ఉన్న 32 మంది రీలర్లు మల్టీ ఎండ్‌ రీలింగ్‌ మిషన్‌లు ఏర్పాటు చేసుకున్నారు. వీరికి బీవీ (బైవోల్టీన్‌ రకం) పట్టుగూళ్లు అయితేనే పట్టుదారం తెగిపోకుండా ఎక్కువ మొత్తంలో వస్తుందని అందుకే ఇక్కడి రీలర్లు ఎక్కువగా బైవోల్టీన్‌ రకం గూళ్లు కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. కాగా మదనపల్లె మార్కెట్‌కు ఒకప్పుడు రోజుకు 5 వేల కిలోల పట్టుగూళ్లు విక్రయానికి వస్తుండగా, నేడు కేవలం 50 నుంచి 400 కిలోల గూళ్లే విక్రయానికి వస్తున్నాయి. ఒక్కో రీలర్‌కు నిత్యం ఎంత లేదన్నా 100 కిలోల పట్టుగూళ్ల అవసరం వస్తోంది. ఇక్కడ గూళ్లు అందుబాటులో లేకపోవడంతో రీలర్లు పలమనేరు, కుప్పం పట్టుగూళ్ల మార్కెట్‌పై ఆధారపడాల్సి వస్తోంది.

మార్కెట్‌ పరిస్థితి అగమ్య గోచరం

మదనపల్లె పట్టణం సీటీఎం రోడ్డులోని ఇండస్ట్రియల్‌ ఎస్టేట్‌లో ఉన్న ప్రభుత్వ పట్టుగూళ్ల మార్కెట్‌ ఒకప్పుడు రాష్ట్రంలో పేరు మోసింది. ఇక్కడికి నాలుగు జిల్లాల నుంచి రైతులు పట్టుగూళ్లను విక్రయానికి తీసుకువచ్చేవారు. కాగా మారిన పరిస్థితులతో మార్కెట్‌కు తక్కువగా పట్టుగూళ్లు విక్రయానికి వస్తున్నాయి. ఈ మార్కెట్‌పై ఆధారపడి మల్టీ ఎండ్‌ రీలింగ్‌ మిషన్‌లు పెట్టుకున్న రీలర్లు, వారికి అనుసంధానంగా కార్మికులు పట్టుగూళ్లు రాక అయోమయంలో పడిపోతున్నారు. గత్యంతరం లేక పలమనేరు, కుప్పం, కర్ణాటక మార్కెట్‌లపై ఆధారపడాల్సి వస్తోంది. దీంతో దూరాభారం పెరిగి రీలింగ్‌ గిట్టుబాటు అయ్యే పరిస్థితులు కనపడటం లేదు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే ఇటీవల మూతపడిన చేబ్రోలు పట్టుగూళ్ల మార్కెట్‌ పరిస్థితే మదనపల్లె మార్కెట్‌కు ఎదురవుతుందని పలువురు పేర్కొంటున్నారు.

బీవీ రకంపై అవగాహన కల్పిస్తున్నాం

- పి.రామ్మోహన్‌, సిరికల్చర్‌ ఏడీ, పట్టుగూళ్ల మార్కెట్‌ ఆఫీసర్‌, మదనపల్లె

మదనపల్లె ప్రాంతంలో సీబీ రకం సాగు చేస్తున్న రైతులకు బీవీ రకంపై అవగాహన కల్పిస్తున్నాం. ప్రభుత్వం ఇచ్చే రాయితీలను రైతులకు వివరించడంతో పాటు, టమోటా పంటలకు దూరంగా మల్బరీ సాగు చేయాలని సూచిస్తున్నాం. డివిజన్‌లోని 15 మండలాల్లో మల్బరీ సాగు, పట్టుగూళ్ల ఉత్పత్తికి చర్యలు తీసుకుంటున్నాం.

Updated Date - 2023-02-01T23:19:20+05:30 IST