దంపతుల ఆత్మహత్యాయత్నం
ABN , First Publish Date - 2023-02-01T23:09:09+05:30 IST
అప్పుల బాధతో జీవితం మీద విరక్తి చెందిన దంపతులు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించారు. ఈ సంఘటన బుధవారం గుర్రంకొండ మండలంలో జరిగింది.
కన్నబిడ్డల ఎదుటే ఘటన
ఆస్పత్రికి తరలించడంతో తప్పిన ప్రాణాపాయం
మదనపల్లె క్రైం, ఫిబ్రవరి 1: అప్పుల బాధతో జీవితం మీద విరక్తి చెందిన దంపతులు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించారు. ఈ సంఘటన బుధవారం గుర్రంకొండ మండలంలో జరిగింది. పోలీసుల కథనం మేరకు.. మదనపల్లె మండలం కోళ్లబైలు పంచాయతీ బాబుకాలనీకి చెందిన ఆనంద్ (29) చేనేత కార్మికుడిగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇతడికి భార్య లక్ష్మి (22), ఇద్దరు కుమారులున్నారు. గతంలో కుటుంబ నిర్వహణకు, ఇతర వాటి కోసం చేసిన అప్పులు అసలు, వడ్డీతో కలిపి రూ.5 లక్షలకు చేరాయి. అయితే రుణదాతల నుంచి ఒత్తిళ్లు, వేధింపులు ఎక్కువ కావడంతో కొద్ది రోజులుగా దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. కాగా ఇటీవల గొడవలు జరగడంతో లక్ష్మి తన పిల్లలను తీసుకుని పుట్టినిల్లు అయిన కలకడ మండలం కదిరాయచెరువుకు వెళ్లిపోయింది. ఇదిలా ఉండగా ఆనంద్ భార్యాపిల్లలను తీసుకొచ్చేందుకు మంగళవారం అత్తారింటికి వెళ్లాడు. అక్కడ భార్యను ఒప్పించుకుని నలుగురూ కలసి బుధవారం మదనపల్లెకు బయలుదేరారు. దారిలో గుర్రంకొండ బస్టాండులో బస్సు దిగారు. అక్కడ ఓ పెస్టిసైడ్స్ దుకాణంలో పురుగుల మందు డబ్బా తీసుకుని రోడ్డుపక్కన పిల్లలను కూర్చోబెట్టి వారిద్దరూ పురుగుల మందు తాగి కిందపడిపోవడంతో పిల్లలు గట్టిగా ఏడ్చారు. ఇది గమనించిన స్థానికులు అక్కడి చేరుకుని దంపతులను స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి అక్కడి నుంచి మదనపల్లె ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి మెరుగైన వైద్యం అందించడంతో వారిద్దరూ కోలుకుంటున్నారు. సమాచారం అందుకున్న గుర్రంకొండ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని స్థానికులను విచారించిన అనంతరం పిల్లలను కుటుంబ సభ్యులకు అప్పగించారు. అలాగే జిల్లా ప్రభుత్వాస్పత్రికి చేరుకుని ఘటనపై దంపతులను విచారించి స్టేట్మెంట్ రికార్డు చేశారు. అప్పులు తీర్చలేక జీవితం మీద విరక్తి చెంది ఆత్మహత్యకు యత్నించినట్లు బాధితులు చెప్పారు. కూలి పనులు చేసి అప్పులు తీర్చేద్దామని చెప్పినా భార్య వినకపోవడంతో ఈ అఘాయిత్యానికి పాల్పడాల్సి వచ్చిందని ఆనంద్ ఆవేదన వ్యక్తం చేశాడు. నలుగురం కలసి ఆత్మహత్య చేసుకోవాలని తొలుత అనుకున్నామని, మళ్లీ పిల్లలను పక్కన పెట్టి తామే..ఆత్మహత్యకు యత్నించినట్లు బాధితుడు చెప్పాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.