మద్యానికి బానిసై యువకుడి ఆత్మహత్య

ABN , First Publish Date - 2023-02-01T23:28:30+05:30 IST

మద్యానికి బానిసై జీవితంపై విరక్తి చెంది మన్నె కార్తీక్‌కుమార్‌రెడ్డి (27) ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

మద్యానికి బానిసై యువకుడి ఆత్మహత్య

ప్రొద్దుటూరు క్రైం, ఫిబ్రవరి 1 : మద్యానికి బానిసై జీవితంపై విరక్తి చెంది మన్నె కార్తీక్‌కుమార్‌రెడ్డి (27) ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన ఆచార్ల కాలనీ సమీపంలోని ఓ ప్రైవేట్‌ వెంచర్‌లో బుధవారం ఉదయం వెలుగుచూసింది. పోలీసుల వివరాల మేరకు... గోపవరం పంచాయతీ అంజనాద్రినగర్‌లో నివశిస్తున్న మన్నె రామసుబ్బారెడ్డి ఇద్దరు కుమారులు. పెద్దకుమారుడు మురళీధర్‌రెడ్డి ఆర్మీలో పనిచేస్తుండగా, చిన్న కుమారుడు కార్తీక్‌కుమార్‌రెడ్డి కారుడ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. 15 రోజుల క్రితం మురళీధర్‌రెడ్డి సెలవుపై ప్రొద్దుటూరు వచ్చి ఇంటి వద్దే ఉంటున్నారు. కుమారులిద్దరికి ఇంకా వివాహం కాలేదు. కాగా, కార్తీక్‌కుమార్‌రెడ్డి మద్యానికి అలవాటుపడి డ్రైవర్‌ పనికి వెళ్లేవాడు కాదు. మద్యం కోసం డబ్బులివ్వమని ఇంట్లో వారితో గొడవపడుతూ.. ఇంటి నుంచి బయటికి వెళ్లి తరువాత వచ్చేవాడు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి మద్యం కోసం డబ్బులు ఇవ్వమని తండ్రితో గొడవపడ్డాడు. తన దగ్గర డబ్బులేవని తండ్రి చెప్పడంతో ఇంటి నుంచి వెళ్లిపోయాడు. తిరిగి మళ్లీ వస్తాడులే అనుకున్నారు. అయితే రాత్రి సమయంలో కార్తీక్‌కుమార్‌రెడ్డి తండ్రికి ఫోన్‌ చేసి తాను ఆచార్లకాలనీ ఎదురుగా బైపా్‌సలో ఉన్న వెంచర్‌లో ఉరివేసుకుని చనిపోతున్నట్లు చెప్పాడు. నీ కంత కష్టమేమొచ్చిందని.. ఏదైనా ఉంటే నీకు ఇబ్బంది లేకుండా నేను చూసుకుంటాను... తొందరపడ వద్దంటూ చెబుతుండగానే ఫోన్‌ కట్‌ అయింది. దీంతో రామసుబ్బారెడ్డి, భార్య, పెద్దకొడుకుతో కలిసి సంఘటన స్థలం వద్దకు వెళ్లగా... అక్కడ చెట్టుకు ఉరివేసుకుని వేలాడుతూ కనిపించాడు. వెంటనే అతన్ని చికిత్స కోసం ప్రొద్దుటూరు ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్దారించారు. సమాచారం అందుకున్న ఎస్‌ఐ సంజీవరెడ్డి సిబ్బందితో కలిసి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీశారు. మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. మృతుని తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ సంజీవరెడ్డి తెలిపారు.

Updated Date - 2023-02-01T23:28:33+05:30 IST