పోలీస్‌స్టేషన్‌ ఎదుటే చితకబాదారు

ABN , First Publish Date - 2023-02-02T01:24:46+05:30 IST

పోలీసుస్టేషన్‌ ఎదుట ఒక వ్యక్తిని జనం చితకబాదిన వైనం బుధవారం రాత్రి సీతానగరం పోలీస్‌ స్టేషన్‌ వద్ద జరిగింది. ఈ పరిస్థితిని అదుపులోకి తేవడానికి పోలీసులు సైతం నానా పాట్లు పడడమేకాక కొంతసేపు నిస్సహాయ స్థితిలో చేతులెత్తేశారు. వివరాలివి..

పోలీస్‌స్టేషన్‌ ఎదుటే చితకబాదారు

సీతానగరం, ఫిబ్రవరి 1 : పోలీసుస్టేషన్‌ ఎదుట ఒక వ్యక్తిని జనం చితకబాదిన వైనం బుధవారం రాత్రి సీతానగరం పోలీస్‌ స్టేషన్‌ వద్ద జరిగింది. ఈ పరిస్థితిని అదుపులోకి తేవడానికి పోలీసులు సైతం నానా పాట్లు పడడమేకాక కొంతసేపు నిస్సహాయ స్థితిలో చేతులెత్తేశారు. వివరాలివి.. వంగలపూడి గ్రామానికి చెందిన కొత్తపల్లి వీరబాబు అనే వ్యక్తి రఘుదేవపురంలో పలు షాపు యజమానుల వద్దకు వెళ్లి తనకు రూ.500 ఫోన్‌పే చేయాలని కోరాడు. కానీ పలు షాపుల్లో వీలుకాకపోవడంతో చివరిగా నాగ విజయ శ్రీను షాపునకు వెళ్లి అడిగాడు. అక్కడ కూడా ఇవ్వకపోవడంతో షాపు యజమాని నాగవిజయ శ్రీనుపై దాడిచేశాడు. దీంతో శ్రీను సీతానగరం పోలీసుస్టేషన్‌కు చేరుకుని ఫిర్యాదు చేసే క్రమంలో ఇరు వర్గాలకు చెందిన జనం పోగవడంతో పోలీస్‌ స్టేషన్‌ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఇంతలో కొత్తపల్లి వీరబాబు బయటకు రావడంతో నాగవిజయ శ్రీను వర్గం ఒక్కసారిగా అతనిపై దాడిచేసి కొట్టడం ప్రారంభించారు. ఆ సమయంలో పోలీసులు వారిని అదుపు చేయలేకపోయారు. అతన్ని కొట్టి వదిలేసిన తర్వాత పోలీస్‌ స్టేషన్‌ ఎదుట రోడ్డుపై పడి ఉన్న వీరబాబును పోలీసులు స్టేషన్‌లోకి మోసుకెళ్లారు. ఈ సంఘటన సీతానగరంలో చర్చనీయాంశమైంది. అప్పటికే గ్రామంలో వాతావరణం ఉద్రి క్తంగా ఉండగా, వీరబాబును బయటకు ఎందుకు వెళ్లనిచ్చారంటూ స్థానికులు ప్రశ్నిస్తున్నారు.

Updated Date - 2023-02-02T01:24:52+05:30 IST