హెడ్మాస్టర్ హత్య కేసులో జీవితఖైదు
ABN , First Publish Date - 2023-02-07T00:07:09+05:30 IST
హెడ్మాస్టర్ హత్య కేసులో నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్షను విధిస్తూ కాకినాడ నాల్గో జిల్లా సెషన్స్ కోర్టు తీర్పునిచ్చింది.
కాకినాడ క్రైం, ఫిబ్రవరి 6: హెడ్మాస్టర్ హత్య కేసులో నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్షను విధిస్తూ కాకినాడ నాల్గో జిల్లా సెషన్స్ కోర్టు తీర్పునిచ్చింది. కుట్ర, దొంగతనం, హత్య కేసులో విచారణ ఎదుర్కొన్న నిందితుడికి జీవిత ఖైదు, దొంగతనం నేరం కింద మరో 3 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. కాకినాడ రూరల్ మండలం వెలమల తూరంగికి చెందిన హెడ్మాస్టర్ పట్నాల వెంకటరావు (57) స్థానిక అపురూప లివింగ్స్లో నివాసం ఉంటున్నారు. 14 సెప్టెంబరు 2019వ తేదీ రాత్రి సమయంలో హెడ్మాస్టర్ ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో ఇంటి వెనుకవైపు గల డోర్ నుంచి రేపూరుకు చెందిన 21 ఏళ్ల ఇసుకపాటి ఏసురాజు లోపలికి వెళ్లి వెంకటరావును కత్తితో విచక్షణారహితంగా నరికి హత్య చేసి, ఇంట్లో ఉన్న విలువైన వస్తువులు, డబ్బు దొంగిలించాడు. వెంకటరావు కుమార్తె కందవిల్లి సత్యసూర్య రామదీపిక ఇచ్చిన ఫిర్యాదు మేరకు అప్పటి దర్యాప్తు అధికారి ఆకుల మురళీకృష్ణ సమగ్ర దర్యాప్తు చేసి నిందితుడిని అరెస్టు చేశారు. సోమవారం కోర్టులో ప్రాసిక్యూషన్ తరపున బలమైన వాదన వినిపించగా, నాలుగో జిల్లా సెషన్స్ జడ్జి ఎం. హరినారాయణ ఇసుకపాటి ఏసురాజుకు జీవితఖైదు, దొంగతనం నేరంలో మరో 3 ఏళ్ల జైలుశిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చినట్లు జిల్లా ఎస్పీ ఎం.రవీంద్రనాథ్బాబు తెలిపారు. ఈ కేసులో ముగ్గురు బాలనేరస్తులను గుర్తించారన్నారు. కోర్టులో బలమైన వాదనలు విపించిన డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ వై. ప్రశాంతి కుమారి, సమగ్ర దర్యాప్తు చేసిన సర్పవరం ఎస్హెచ్వో, అప్పటి దర్యాప్తు అధికారి ఏ మురళీకృష్ణలను ఎస్పీ అభినందించారు. అలాగే బలమైన సాక్ష్యాలను సమకూర్చి నిందితుడికి శిక్ష పడటంలో విశేష కృషి చేసిన కాకినాడ రూరల్ సర్కిల్ సీఐ కె. శ్రీనివాస్, ఎస్ఐ నాగరాజులను ప్రత్యేకంగా అభినందించారు.