మన ‘పద్మాలు’
ABN , First Publish Date - 2023-01-26T02:01:49+05:30 IST
ఏకంగా గోదావరి జిల్లాలకు చెందిన ముగ్గురిని వరించాయి. దీంతో ఆయా ప్రాంతాల్లో ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తంచేస్తున్నారు. తెలంగాణ కోటా నుంచి ప్రముఖ ఆధ్యాత్మిక గురువు శ్రీత్రిదండి రామానుజ చినజీయర్ పద్మభూషణ్కు ఎంపికయ్యారు. స్వామీజీ స్వగ్రామం మండపేట మండలం అర్తమూరు. ఇక ఆంధ్రప్రదేశ్ కోటా నుంచి ఇద్దరు పద్మశ్రీ అవార్డులకు ఎంపికయ్యారు. అందులో ఒకరు.. కాకినాడలో సంకురాత్రి ఫౌండేషన్ ద్వారా శ్రీకిరణ్ కంటి ఆస్పత్రిని నిర్వహిస్తున్న డాక్టర్ సంకురాత్రి చంద్రశేఖర్. ఈయన సింగరాయకొండలో జన్మించినప్పటికీ బాల్యం, చదువు, సేవలు అన్నీ రాజమహేంద్రవరం, కాకినాడల్లోనే. మరొకరు ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి. ఈయన కూడా పద్మశ్రీకి ఎంపికయ్యారు. స్వస్థలం కొవ్వూరు.
తెలంగాణ నుంచి చినజీయర్కు పద్మభూషణ్..
ఆంధ్ర నుంచి సంకురాత్రి, కీరవాణిలకు పద్మశ్రీ
దేశంలోనే అత్యున్నత పౌరసేవా పురస్కారాలైన పద్మభూషణ్, పద్మశ్రీ అవార్డులు
ఏకంగా గోదావరి జిల్లాలకు చెందిన ముగ్గురిని వరించాయి. దీంతో ఆయా ప్రాంతాల్లో ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తంచేస్తున్నారు. తెలంగాణ కోటా నుంచి ప్రముఖ ఆధ్యాత్మిక గురువు శ్రీత్రిదండి రామానుజ చినజీయర్ పద్మభూషణ్కు ఎంపికయ్యారు. స్వామీజీ స్వగ్రామం మండపేట మండలం అర్తమూరు. ఇక ఆంధ్రప్రదేశ్ కోటా నుంచి ఇద్దరు పద్మశ్రీ అవార్డులకు ఎంపికయ్యారు. అందులో ఒకరు.. కాకినాడలో సంకురాత్రి ఫౌండేషన్ ద్వారా శ్రీకిరణ్ కంటి ఆస్పత్రిని నిర్వహిస్తున్న డాక్టర్ సంకురాత్రి చంద్రశేఖర్. ఈయన సింగరాయకొండలో జన్మించినప్పటికీ బాల్యం, చదువు, సేవలు అన్నీ రాజమహేంద్రవరం, కాకినాడల్లోనే. మరొకరు ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి. ఈయన కూడా పద్మశ్రీకి ఎంపికయ్యారు. స్వస్థలం కొవ్వూరు.
మండపేట, జనవరి 25: ప్రముఖ ఆధ్యాత్మిక గురువు శ్రీత్రిదండి రామానుజ చినజీయర్స్వామీజీకి కేంద్రప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారాన్ని ప్రకటించింది. దీంతో ఆయన పుట్టిన పెరిగిన మండపేట మండలం అర్తమూరులో హర్షాతిరే కాలు వ్యక్తమవుతున్నాయి. 1956 అక్టోబరు 31న డాక్టర్ కృష్ణామాచారి, అలివేలు మంగతాయారు దంపతులకు నాలుగో సంతానంగా జీయర్ జన్మించారు. చిన్న తనంలో తండ్రిని కోల్పోయినా తల్లి ప్రోద్బలంతో ఆయన రాజమహేంద్రవరంలో ఉన్నత విద్యాభ్యాసం పూర్తిచేసి స్టెనోగా పనిచేశారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు పెదజీయర్ వచ్చినప్పుడు చినజీయర్ కలిశారు. ఆయనతో ఏర్పడిన పరిచయంతో పెద్ద స్వామీజీ వద్ద స్టెనోగా చేరి తర్వాత ఆధ్యాత్మిక గురువుగా మారారు. 67 ఏళ్ల జీయర్ హిందూమత పరిరక్షణకుకార్యక్రమాలు చేస్తున్నారు.
మన మరకతమణి.. ఎంఎం కీరవాణి
కొవ్వూరు, జనవరి 25 : కోడూరి మరకతమణి కీరవాణి అంటే గుర్తుపట్టడం కాస్త కష్టమే. ఆయనే ఎంఎం కీరవాణి. దేశంలోనే అత్యున్నత పురస్కారమైన పద్మశ్రీ కీరవాణిని వరించింది. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ చిత్రం ద్వారా అనేక అంతర్జాయతీయ పురస్కారాలు అందుకుంటూ వస్తున్న ఆయనకు భారత ప్రభుత్వం అందించిన అరుదైన గౌరవం. కొవ్వూరు పట్టణంలో 1961 జూలై 4న కోడూరి శివశక్తి దత్త, భానుమతి దంపతులకు కీరవాణి జన్మించారు. కొవ్వూరుకి చెందిన సంగీత టీచర్ కవిటపు సీతన్న వద్ద ఫిడేలు (వయోలిన్) నేర్చుకున్నారు. అనంతరం కీరవాణి తండ్రి రాయచూర్ వెళ్లిపోయారు. కీరవాణికి పద్మశ్రీ రావడంతో వరుసకు చిన్నాన్న మాజీ ఎమ్మెల్సీ కోడూరి శివ రామకృష్ణ తులసీ వరప్రసాద్ హర్షం వ్యక్తం చేశారు.
కుటుంబం మొత్తం కోల్పోయినా.. ఎందరికో వెలుగు
సంకురాత్రి ఫౌండేషన్ చైర్మన్కు పద్మశ్రీ
సర్పవరం జంక్షన్, జనవరి 25: పద్మశ్రీ అవార్డుకు మంజరి సంకురాత్రి ఫౌండేషన్ వ్యవస్థాపకులు, శ్రీకిరణ్ కంటి ఆస్పత్రి ఫౌండర్ డాక్టర్ సంకురాత్రి చంద్రశేఖర్ ఎంపికయ్యారు. లక్షలాది మందికి నేత్రదానం చేస్తూ వేలాదిమంది అంధుల జీవితాల్లో వెలుగులు ప్రసాదించిన ఆయనను కేంద్ర ప్రభుత్వం ఈ పురస్కారానికి ఎంపిక చేసింది. డాక్టర్ సంకురాత్రి చంద్రశేఖర్ 1943 నవంబరు 20న జన్మించారు. తండ్రి సంకురాత్రి అప్పల నర్సయ్యనాయుడు, తల్లి రామయ్యమ్మ. చంద్రశేఖర్ సింగరాయ కొండలో జన్మించారు. ఎనిమిదేళ్ల వయస్సులో రాజమహేంద్రవరం మున్సిపల్ హైస్కూళ్లో విద్యనభ్యసించారు. అనం తరం ఆంధ్ర విశ్వవిద్యాలయంలో జువాలజీలో ఎంఎస్సీ చదివారు. ఆ తర్వాత ఉన్నత చదువులకు కెనడా వెళ్లారు. అక్కడ మెమోరియల్ విశ్వవిద్యాలయంలోని బయాలజీలో ఎంఎస్సీ అభ్యసించారు. తర్వాత ఆల్బర్ట్ యూనివర్సిటీలో జువాలజీలో పీహెచ్డీ చదివారు. ఆ తర్వాత సైంటిస్ట్గా కెనడాలో ఉద్యోగం చేశారు. బయాలజిస్ట్గా కెనడా దేశం లోని ఒట్టావాలో స్థిరపడ్డారు. కాకినాడకు చెందిన మంజరిని 1975, మేలో వివాహం చేసుకున్నారు. విద్రోహ చర్య కారణంగా భార్య, కు మారుడు, కుమార్తె మరణించారు. కుటుంబం మొత్తం కోల్పోయిన అధైర్యపడకుండా కుమారుడు శ్రీకిరణ్ పేరుతో శ్రీకిరణ్ కంటి ఆసుపత్రి, కుమార్తె శారద పేరుతో శ్రీశారదా విద్యాలయం ఏర్పాటుచేశారు. ఇంటి పేరు సంకురాత్రి ఫౌండేషన్ ఆధ్వర్యంలో కాకినాడ రూరల్ మండలంలో శ్రీకిరణ్ కంటి ఆసుపత్రి ద్వారా సేవలందిస్తున్నారు.