హౌసింగ్‌లో సిబ్బంది చేతివాటం..!

ABN , First Publish Date - 2023-01-26T02:45:29+05:30 IST

పేదలందరికీ ఇళ్లు పథకంలో హౌసింగ్‌ సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తున్నారనే ఫిర్యాదులు వస్తున్నాయి.

హౌసింగ్‌లో సిబ్బంది చేతివాటం..!
పెనుమూరు మండలం మఠంపల్లి లేఅవుట్‌

లబ్ధిదారుల ఫిర్యాదుతో వెలుగులోకి..

వర్క్‌ ఇన్‌స్పెక్టర్‌పై చర్యలకు పెనుమూరు ఎంపీడీవో సిఫారసు

చిత్తూరు (సెంట్రల్‌), జనవరి 25: పేదలందరికీ ఇళ్లు పథకంలో హౌసింగ్‌ సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తున్నారనే ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ విషయమై డిప్యూటీ సీఎం నారాయణస్వామికి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఇటు లబ్ధిదారులు, అటు వైసీపీ నేతలు ఫిర్యాదు చేయడం చర్చనీయాంశంగా మారింది. పురోగతిలోని ఇళ్ల నిర్మాణాలకు సిమెంట్‌ బస్తాలు ఇవ్వాలన్నా, బిల్లు పెట్టాలన్నా హౌసింగ్‌ సిబ్బందికి చేతులు తడపాల్సి వస్తోందన్న ఆరోపణలున్నాయి. పెనుమూరు మండలం హౌసింగ్‌ వర్క్‌ ఇన్‌స్పెక్టర్‌ గోవిందస్వామిపై ఇలాంటి ఫిర్యాదులే వచ్చాయి. విచారణలో నిజమని తేలడం ఈ ఆరోపణలకు బలం చేకూర్చుతోంది. పెనుమూరు మండలంలో 20 లేఅవుట్‌లలో 1,513 గృహాలు మంజూరు చేశారు. వీటిలో 528 పూర్తి కాగా, మౌల్డింగ్‌ వేసినవి 300, లింటల్‌ లెవల్‌లో 136, కడగాలు వేసినవి 454, కడగాలు వేయడానికి గుంతలు తవ్వి సిద్ధంగా ఉంచుకున్నవి 88 ఉన్నాయి. ఏడు ఇళ్లు ఇప్పటి వరకు ఎలాంటి నిర్మాణానికీ నోచుకోలేదు. వర్క్‌ ఇన్‌స్పెక్టర్‌ గోవిందస్వామి లబ్ధిదారుల నుంచి లంచం తీసుకుంటున్నారని ఈనెల 11న జరిగిన మండల సర్వసభ్య సమావేశంలో సభ్యులు అధికారుల దృష్టికి తెచ్చారు. ఎండీఈవో శివయ్య 13న విచారణ చేపట్టారు. ఇళ్ల నిర్మాణాలకు సిమెంట్‌ ఇవ్వడానికి రూ.200లు వసూలు చేస్తున్నారని తేలింది. గొడుగుచింత గ్రామంలో ఇళ్ల నిర్మాణాల బిల్లులు పెట్టడానికి లబ్ధిదారులు జమున, రాజేశ్వరి నుంచి రూ.10 వేలు చొప్పున లంచం తీసుకున్నట్లు తేలింది. దీనిపై జేసీకి నివేదిక పంపారు.

Updated Date - 2023-01-26T02:45:30+05:30 IST