భాకరాపేట ప్రభుత్వ భూముల్లో రెవిన్యూ హెచ్చరిక బోర్డు
ABN , First Publish Date - 2023-01-25T00:21:08+05:30 IST
చిన్నగొట్టిగల్లు మండలం భాకరాపేట న్యూ కాలనీ సమీపంలో ఆక్రమణలకు గురవుతున్న ప్రభుత్వ భూమిలో రెవిన్యూ అధికారులు హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశారు.
అక్రమ కట్టడాలకు నేడు మార్కింగ్
రిపబ్లిక్ డే వేడుకలు ముగియగానే కట్టడాల తొలగింపు
భాకరాపేట, జనవరి 24: చిన్నగొట్టిగల్లు మండలం భాకరాపేట న్యూ కాలనీ సమీపంలో ఆక్రమణలకు గురవుతున్న ప్రభుత్వ భూమిలో రెవిన్యూ అధికారులు హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశారు. ప్రభుత్వ భూములను పెద్ద ఎత్తున కబ్జా చేస్తుండడం, వాటిల్లో అక్రమ కట్టడాలు జోరుగా వెలుస్తుండడంపై టీడీపీ నేతలు ఆందోళనకు దిగిన సంగతి తెలిసిందే. ఈ విషయం వెలుగు చూడడంతో జిల్లా అధికారులు స్పందించారు. వారి ఆదేశాలపై సర్వే చేస్తున్న చిన్నగొట్టిగల్లు రెవిన్యూ అధికారులు మంగళవారం సంబంధిత భూముల్లో హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశారు. సర్వే నెంబరు 329లోని 121.84 ఎకరాల ప్రభుత్వ భూమిని పరిశ్రమల కోసం ఏపీఐఐసీకి కేటాయించడం జరిగిందని అందులో పేర్కొన్నారు. ఈ సర్వే నంబరులో ఇతరులు ఎవరైనా ప్రవేశిస్తే సివిల్, క్రిమినల్ చర్యలకు బాధ్యులవుతారని హెచ్చరిక చేశారు. కాగా ఈ విషయమై తహసిల్దారు హనుమాన్ నాయక్తో మాట్లాడగా తాము చేపట్టిన సర్వే బుధవారం పూర్తవుతుందని చెప్పారు. ఈలోపు ప్రాధమిక నిర్ధారణ మేరకు భూముల్లో హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశామని చెప్పారు. అంతే కాకుండా ప్రభుత్వ భూముల్లోని అక్రమ కట్టడాలకు బుధవారమే మార్కింగ్ చేస్తామని, గురువారం రిపబ్లిక్ డే వేడుకలు ముగియగానే అదే రోజు అక్రమ కట్టడాలను తొలగిస్తామని స్పష్టం చేశారు. మరోవైపు భాకరాపేటలో ఇంత భారీ స్థాయిలో ప్రభుత్వ భూములు కబ్జా అవుతున్న వైనం మీడియాలో రావడంతో మండలవ్యాప్తంగా కలకలం రేగింది. మంగళవారం మండలంలో ఎక్కడ చూసినా జనంలో దీనిపైనే చర్చ నడిచింది.