మా ఫోన్లూ ట్యాప్‌ చేస్తున్నారు: రామకృష్ణ

ABN , First Publish Date - 2023-02-07T03:46:20+05:30 IST

జగన్‌ ప్రభుత్వం మా ఫోన్లు కూడా ట్యాపింగ్‌ చేస్తోంది. ఆ విషయం ఎప్పటి నుంచో మాకు తెలుసు.

మా ఫోన్లూ ట్యాప్‌ చేస్తున్నారు: రామకృష్ణ

తిరుపతి, ఫిబ్రవరి 6(ఆంధ్రజ్యోతి): ‘‘జగన్‌ ప్రభుత్వం మా ఫోన్లు కూడా ట్యాపింగ్‌ చేస్తోంది. ఆ విషయం ఎప్పటి నుంచో మాకు తెలుసు. ఇంతకాలం ప్రతిపక్ష నాయకుల ఫోన్లు మాత్రమే ట్యాపింగ్‌ చేసిన జగన్‌ ప్రభుత్వం ఇపుడు అధికార పార్టీ ఎమ్మెల్యేలు, నాయకుల ఫోన్లను కూడా ట్యాప్‌ చేస్తోంది’’ అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. సోమవారం తిరుపతిలో కలెక్టరేట్‌ ఎదుట పేదల పక్కా ఇళ్ల కోసం సీపీఐ చేపట్టిన ధర్నాలో పాల్గొన్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘జగన్‌ అధికారంలోకి రాగానే పోలీసులు ముఖ్యంగా సీఐడీ పోలీసులు పూర్తిస్థాయిలో యాక్టివ్‌ అయ్యారు. ప్రజాస్వామ్యమంటే ఏమాత్రం గౌరవం లేకుండా ప్రతిపక్ష పార్టీల ఉద్యమాలను అడ్డుకోవడం, అనవసరంగా కేసులు పెట్టడం, గృహ నిర్బంధాలు, విచారణల పేరిట నోటీసులు ఇవ్వడం చేస్తున్నారు. ఇపుడు పరాకాష్ఠగా ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారం బయట పడింది. ట్యాపింగ్‌ గురించి చెపుతున్న సాక్షాత్తు ఎమ్మెల్యేని తన బండికి కట్టుకుని లాక్కుపోతానని ఓ రౌడీ చెబుతున్నా ప్రభుత్వం కిమ్మనడం లేదు. రాజధాని విషయం త్వరగా తేల్చాలనే మేమూ కోరుతున్నాం. విశాఖ పోయి ఉంటానని జగన్‌ ఇప్పటికే చెబుతున్నాడని, కోర్టును ధిక్కరించి విశాఖ పోతే అలాగే సముద్రంలో కలిసిపోతాడు’’ అని అన్నారు. రాష్ట్రంలోని బడుగు, బలహీన వర్గాలకు చెందిన లక్షలాది ఎకరాల అసైన్డ్‌ భూములన్నీ అధికార పార్టీ ఎమ్మెల్యేలకు కట్టబెట్టడానికి సాక్షాత్తూ రెవెన్యూ మంత్రే పనిచేస్తున్నాడు. ధర్మాన ప్రసాదరావుకు పేరులో మాత్రమే ధర్మం ఉందని, కానీ ఇంత అధర్మమైన మంత్రి ఇంకొకరు లేరని రామకృష్ణ అన్నారు.

Updated Date - 2023-02-07T03:46:20+05:30 IST