Lokesh Padayatra : జగన్ను ఇంటికి పంపేద్దాం
ABN , First Publish Date - 2023-02-02T03:08:33+05:30 IST
అసెంబ్లీలో ఎమ్మెల్యేలు, మంత్రులు మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. అందుకే రాష్ట్రంలో మహిళలపై దాడులు జరుగుతున్నాయి.
వైసీపీ నేతల తీరుతోనే మహిళలపై దాడులు
ఇసుక అక్రమ రవాణాతో రూ.వేల కోట్ల దోపిడీ
భూముల రీ సర్వే పేరిట భారీ కుంభకోణం
ఆరో రోజు యువగళం పాదయాత్రలో లోకేశ్
ఇప్పటివరకూ 72.1 కిలోమీటర్లు సాగిన నడక
చిత్తూరు(ఆంధ్రజ్యోతి)/పలమనేరు, ఫిబ్రవరి 1: ‘అసెంబ్లీలో ఎమ్మెల్యేలు, మంత్రులు మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. అందుకే రాష్ట్రంలో మహిళలపై దాడులు జరుగుతున్నాయి. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఒంగోలులో ఓ మహిళపై అత్యాచారం జరిగితే, నేరుగా ఎస్పీకి కాల్ చేసి 12గంటల్లో నిందితుడ్ని పట్టుకోవాలని ఆదేశించారు. ఆ భయానికి నిందితుడు ఇంట్లోనే ఆత్మహత్య చేసుకున్నాడు. నాయకుడిని బట్టే సమాజం ఉంటుందని చెప్పడానికి ఈ ఘటనలే నిదర్శనం’ అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. జగన్ సీఎం అయిన తర్వాత రాష్ట్రంలో 900 మంది మహిళలపై దాడులు జరిగాయని, ఇది మారాలంటే జగన్ను శాశ్వతంగా ఇంటికి పంపించాలని ఆయన పిలుపునిచ్చారు. చిత్తూరు జిల్లా పలమనేరు మండలం కొలమాసనపల్లెలో మహిళల సమావేశంలో లోకేశ్ ప్రసంగించారు. యువగళం పేరుతో ఆయన చేపట్టిన పాదయాత్ర బుధవారం ఆరో రోజుకు చేరుకుంది. ఉదయం 9గంటలకు బైరెడ్డిపల్లె మండలం కమ్మనపల్లె కస్తూర్బా పాఠశాల నుంచి పాదయాత్ర మొదలై పలమనేరు మండలంలోకి చేరింది. సాకేఊరు వద్ద చెరుకు రైతులు పడుతున్న ఇబ్బందులను వెంకటరమణ అనే రైతు లోకేశ్కు వివరించారు. టీడీపీ అధికారంలోకి వస్తే నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు అందించి రైతుల సమస్యలు పరిష్కరిస్తామని లోకేశ్ హామీ ఇచ్చారు. బురుశెట్టిపల్లె వద్ద పనులు చేసుకుంటున్న తాపీ మేస్త్రీలు, కూలీలను లోకేశ్ వెళ్లి పలకరించారు. నిర్మాణ సామగ్రి ధరలు పెరిగిపోవడం, ఇసుక దొరక్కపోవడంతో పనుల్లేక తమ పరిస్థితి దుర్భరంగా మారిందని కూలీలు వాపోయారు. ఇసుక అక్రమ రవాణాతో వైసీపీ నాయకులు రూ.వేల కోట్లు సంపాదిస్తున్నారని, టీడీపీ రాగానే మళ్లీ ఉచిత ఇసుక విధానాన్ని తీసుకొస్తామని లోకేశ్ హామీ ఇచ్చారు. అనంతరం వాల్మీకి సామాజికవర్గం ప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు. తమను ఎస్టీల్లో చేర్చే అంశాన్ని ఈ ప్రభుత్వం పూర్తిగా గాలికొదిలేసిందని వారు వాపోయారు. సత్యపాల్ రిపోర్టు ఆధారంగా వాల్మీకులను ఎస్టీల్లో చేర్చాలని 2017లో అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించామని లోకేశ్ గుర్తుచేశారు. దీనిపై సీఎం జగన్కు తాను స్వయంగా లేఖ కూడా రాశానన్నారు. నక్కపల్లెలో ప్రభుత్వం తలపెట్టిన రీసర్వేకు చెందిన రాళ్లను పరిశీలించిన లోకేశ్.... రీసర్వే పేరుతో ప్రభుత్వం కుంభకోణం చేస్తోందని ఆరోపించారు.
కట్టలు తెగిన మహిళల ఆగ్రహం
పాదయాత్రలో భాగంగా పలమనేరు మండలం కొలమాసనపల్లెలో మహిళలతో లోకేశ్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో మహిళల ఆగ్రహం కట్టలు తెగింది. వైసీపీ ప్రభుత్వంలో జరుగుతున్న అక్రమాలు, దౌర్జన్యాలు, దాడుల గురించి ఆగ్రహంగా ప్రసంగించారు. దాదాపు 15మంది మహిళలు మ ఆవేదనను చెప్పుకున్నారు. వారి ప్రసంగాలను ఓపిగ్గా విన్న లోకేశ్.. ‘మీలాగా నేను కూడా మాట్లాడలేనమ్మా’ అని వ్యాఖ్యానించారు. మద్యపాన నిషేధమని, కల్తీ మద్యంతో మనుషుల ప్రాణాలు తీస్తున్నారని గీత అనే మహిళ, టీడీపీ సర్పంచి కావడంతో శిలాఫలకాల్లో తన పేరు లేకుండా చేస్తున్నారని, శివాడి సర్పంచి లలిత వాపోయారు. కాగా, బైరెడ్డిపల్లెలో పాదయాత్ర ముగిసిన తర్వాత కొంతమంది వైసీపీ శ్రేణులు మంగళవారం రాత్రి టీడీపీ బ్యానర్లకు నిప్పుపెట్టారు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. దీనిపై పలమనేరు మండలంలోని గొల్లపల్లె క్రాస్ వద్ద లోకేశ్ బుధవారం మాట్లాడారు. పాదయాత్రకు వస్తున్న ఆదరణను చూసి తట్టుకోలేక వైసీపీ నాయకులు ఇలాంటి పనులు చేస్తున్నారన్నారు. ‘దివంగత ఎన్టీఆర్ కృష్ణుడు, చంద్రబాబు రాముడు... నేను మాత్రం వైసీపీ నేతలకు మొగుడ్ని’ అని వ్యాఖ్యానించారు.
72 కిలోమీటర్లు పూర్తి
బుధవారం ఉదయం బైరెడ్డిపల్లె మండలం కమ్మనపల్లె కస్తూర్బా పాఠశాల నుంచి మొదలైన పాదయాత్ర 13.8 కిలోమీటర్లు సాగి.. పలమనేరు సమీపంలోని కెటిల్ ఫామ్ వద్దకు చేరింది. ఈ ఆరు రోజుల్లోలోకేశ్ 72.1 కిలోమీటర్లు నడిచారు. గురువారం పలమనేరు పట్టణంలో జరగనున్న భారీ బహిరంగ సభ కోసం మాజీ మంత్రి అమరనాథరెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తయ్యాయి.