భూ నిర్వాసితులకు బడ్జెట్లో నిధులు కేటాయించాలి
ABN , First Publish Date - 2023-01-26T00:21:04+05:30 IST
జీడిపల్లి, బీటీపీ, కుందుర్పి కాలువల భూ నిర్వాసితులకు రానున్న బడ్జెట్లో నిధులు కేటాయించాలని పోరాట కమిటీ నాయకులు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
అంబేడ్కర్ విగ్రహం ఎదుట పోరాట కమిటీ నాయకుల నిరసన
అనంతపురం ప్రెస్క్లబ్, జనవరి 25: జీడిపల్లి, బీటీపీ, కుందుర్పి కాలువల భూ నిర్వాసితులకు రానున్న బడ్జెట్లో నిధులు కేటాయించాలని పోరాట కమిటీ నాయకులు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం ఆ కమిటీ ఆధ్వర్యంలో అంబేడ్కర్ విగ్రహం ఎదుట నిరసనకు దిగారు. కమిటీ జిల్లా ప్రధాన కార్యదర్శి సోమర రాహుల్, ఆర్సీసీ రాష్ట్ర అధ్యక్షుడు శివానంద, రాయలసీమ కళావేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి సాకే మల్లికార్జున మాట్లాడుతూ రైతులు భూములు కోల్పోయి నాలుగు సంవత్సరాలవుతున్నా ఇప్పటి వరకూ ప్రభుత్వం వారికి నష్ట పరిహారం చెల్లించకుండా నిర్లక్ష్యం చేస్తోందని మండిపడ్డారు. వెంటనే రానున్న బడ్జెట్లో ఓ నిర్ణయం తీసుకొని ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం నష్టపరిహారం చెల్లించాలన్నారు. రాయదుర్గంలో సీఎం జగన్మోహనరెడ్డి రెండు నెలల్లో భూనిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించి ప్రాజెక్టును పూర్తి చేస్తామని హామీ ఇచ్చారన్నారు. అయితే ఆ హామీ 20 నెలలు గడిచినా అమలు కాలేదన్నారు. ప్రభుత్వాన్ని చిత్తశుద్ధి ఉంటే తక్షణమే నష్టపరిహా రం అందజేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పోరాట కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు రంగంపేట మధు, టీపీ రామన్న, శంకర్, ఓబులురాజు, పాపిరెడ్డిపల్లి పృథ్వీ తదితరులు పాల్గొన్నారు.