పేదోడి ఇంటిపై కన్ను..!
ABN , First Publish Date - 2023-02-06T23:55:08+05:30 IST
అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడు అధికారుల సాయంతో తన ఇంటిని, స్థలాన్ని కబ్జా చేసేందుకు కుట్ర చేస్తున్నాడని కూడేరు మండల కేంద్రానికి చెందిన గొల్ల శేఖర్ వాపోయాడు.
- అధికారుల సాయంతో కబ్జాకు కుట్ర..?
కూడేరు, ఫిబ్రవరి 6: అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడు అధికారుల సాయంతో తన ఇంటిని, స్థలాన్ని కబ్జా చేసేందుకు కుట్ర చేస్తున్నాడని కూడేరు మండల కేంద్రానికి చెందిన గొల్ల శేఖర్ వాపోయాడు. బాధితుడు తెలిపిన మేరకు, గతంలో ఒకరికి కేటాయించిన స్థలం పట్టాను రద్దు చేసి, ఏడాది క్రితం ప్రభుత్వం శేఖర్ పేరిట పట్టా ఇచ్చింది. ఆ స్థలంలో శేఖర్ నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ ఇంటి వెనుక ఉన్న అధికార పార్టీ నాయకుడు ఆ ఇంటిని, స్థలాన్ని కబ్జా చేయడానికి ప్రయత్నించాడు. ఆ స్థలం తనదేనని, తనకు అప్పగించాలని కొన్ని రోజుల క్రితం రెవెన్యూ అధికారుల సాయంతో శేఖర్పై ఒత్తిడి తెచ్చాడు. దీంతో బాధితుడు కోర్టును ఆశ్రయించాడు. ఇంతలో, సోమవారం సాయంత్రం అధికారులు వచ్చి ఇంటిని, స్థలాన్ని ఖాళీ చేయాలని శేఖర్కు సూచించారు. ఎక్స్కవేటర్తో బండలను తొలగించారు. దీంతో బాధితుడు పురుగుల మందు తాగేందుకు యత్నించాడు. అధికారులు, స్థానికులు అడ్డుకున్నారు. తన స్థలాన్ని కబ్జా చేస్తున్నారని, తనకు అధికారులు న్యాయం చేయాలని బాధితుడు వేడుకున్నాడు. కాగా, గొల్ల శేఖర్ పేరిట ఉన్న పట్టా రద్దు అయిందని, అందుకే ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకుంటున్నామని డిప్యూటీ తహసీల్దారు మధుసూదన తెలిపారు.