పింఛన సొమ్ములో శిస్తు కోత

ABN , First Publish Date - 2023-02-02T00:09:05+05:30 IST

వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులకు ఆసరాగా నిలిచే పింఛన నుంచి ఇంటి శిస్తు మినహాయించారు. బొమ్మనహాళ్‌ మండలంలోని సిద్ధరాంపురంలో సుమారు 170 మంది లబ్ధిదారుల పింఛన సొమ్ములో కోత విధించారు.

పింఛన సొమ్ములో శిస్తు కోత
పింఛన కోత విధించారని వాపోతున్న లబ్ధిదారులు

ఒక్కొక్కరి నుంచి రూ.250 పైగా వసూలు

బొమ్మనహాళ్‌, ఫిబ్రవరి 1: వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులకు ఆసరాగా నిలిచే పింఛన నుంచి ఇంటి శిస్తు మినహాయించారు. బొమ్మనహాళ్‌ మండలంలోని సిద్ధరాంపురంలో సుమారు 170 మంది లబ్ధిదారుల పింఛన సొమ్ములో కోత విధించారు. ఒక్కొక్కరి నుంచి రూ.250 నుంచి రూ.300 తీసుకుని, మిగిలిన సొమ్ము ఇచ్చారు. ఈ నెల రూ.2,750 ఇవ్వాల్సి ఉండగా.. చాలామందికి రూ.2,500 ఇచ్చారు. ఇంటి శిస్తు పట్టుకున్నామని వలంటీర్లు చెబుతున్నారని లబ్ధిదారులు వాపోయారు. కానీ ఇంటి శిస్తు కట్టించుకున్నట్లు తమకు రశీదులు ఇవ్వలేదని అన్నారు. గ్రామంలో సుమారు రూ.50 వేలు ఇంటి శిస్తు పేరిట వలంటీర్లు పింఛన్లలో కోత విధించారని సమాచారం. హనుమక్క అనే మానసిక దివ్యాంగురాలి పింఛన నుంచి రూ.300 తీసుకున్నారని ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. గ్రామానికి చెందిన వన్నమ్మ, ప్రభయ్యస్వామి, మారెక్క, హనుమంతరాయుడు, రామన్న, ఉప్పర అనుమంతమ్మ, ఈశ్వరమ్మ, ఎల్లమ్మ, ఆంజినేయ, ఉప్పర అనుమక్క తదితరుల నుంచి రూ.250 చొప్పున తీసుకున్నారు. ఆరు నెలల క్రితం కూడా ఇంటి శిస్తు పేరిట ఒక్కొక్కరి నుంచి రూ.150 వసూలు చేశారని బాధితులు తెలిపారు.

Updated Date - 2023-02-02T00:09:06+05:30 IST