Pawan Kalyan: కలిసివస్తే కొత్త పొత్తులు

ABN , First Publish Date - 2023-01-25T03:39:39+05:30 IST

‘‘ఏపీలో ప్రస్తుతానికి బీజేపీతో పొత్తు ఉంది! అందువల్ల రాబోయే ఎన్నికల్లో ఆ పార్టీతో కలిసే వెళ్తాం. కాదంటే ఒంటరిగానైనా వెళ్తాం. లేదా కొత్త పొత్తులు కలిస్తే వారితో కలిసి వెళ్తాం’’ అని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ పేర్కొన్నారు.

Pawan Kalyan: కలిసివస్తే కొత్త పొత్తులు

ఓట్లు చీలిపోవద్దన్నదే

నా అభిమతం ఎన్నికల ముందే

పొత్తులపై స్పష్టతఛ

అధికారంలో ఉంది మామూలోళ్లు కాదు..

బాబాయినే చంపించుకున్న వాళ్లు

ప్రజాస్వామ్యం అనే పదానికి విలువ లేదు..

వైసీపీపై విశ్వాసం సన్నగిల్లుతోంది

తెలంగాణలో 7-14 లోక్‌సభ స్థానాల్లో పోటీ..

అసెంబ్లీకీ పది మంది వెళ్లాలి

కొండగట్టులో ‘వారాహి’ నుంచి తొలి ప్రసంగం..

నేడు ఇంద్రకీలాద్రిపై పూజలు

జగిత్యాల, జనవరి 24 (ఆంధ్రజ్యోతి): ‘‘ఏపీలో ప్రస్తుతానికి బీజేపీతో పొత్తు ఉంది! అందువల్ల రాబోయే ఎన్నికల్లో ఆ పార్టీతో కలిసే వెళ్తాం. కాదంటే ఒంటరిగానైనా వెళ్తాం. లేదా కొత్త పొత్తులు కలిస్తే వారితో కలిసి వెళ్తాం’’ అని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ పేర్కొన్నారు. ఏదేమైనా ఎన్నికల తేదీలు ప్రకటించడానికి వారం రోజుల ముందు మాత్రమే పొత్తులపై స్పష్టత వస్తుందని చెప్పారు. ఓట్లు చీలకూడదనేదే తన అభిప్రాయమని పునరుద్ఘాటించారు. మంగళవారం తెలంగాణలోని జగిత్యాల జిల్లా మల్యాల మండలం కొండగట్టు అంజన్న ఆలయంలో స్వామిని దర్శించుకున్నారు. అనంతరం ప్రచార రథం ‘వారాహి’కి వాహన పూజలు నిర్వహించారు. ఆ తర్వాత వారాహిపై నుంచి భక్తులు, అభిమానులు, కార్యకర్తలనుద్దేశించి తొలిసారి ప్రసంగించారు. అక్కడి నుంచి కాన్వాయ్‌లో జగిత్యాల శివారులోని బృందావనం ఫ్యామిలీ రిసార్ట్స్‌కు వెళ్లారు. అక్కడ కొద్దిసేపు మీడియాతో మాట్లాడారు. దావోస్‌ సదస్సులో పెట్టుబడులు ఆకర్షించడంలో సీఎం జగన్‌ విఫలమయ్యారని పవన్‌ కల్యాణ్‌ విమర్శించారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్ష నేతలు ఎవరూ తిరగకూడదన్న ఆలోచనతోనే జగన్‌ సర్కారు జీవో 1 తెచ్చిందని ధ్వజమెత్తారు.

gfkhg.jpg

వైసీపీకి 175కి 175 సీట్లు వచ్చేస్తాయన్న నమ్మకం ఉంటే ఇవన్నీ చేయక్కర్లేదని.. అయినా ఇవన్నీ చేస్తున్నారంటే వారి విశ్వాసం సన్నగిల్లుతోందని.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థితిలో లేరని అర్థమని వ్యాఖ్యానించారు. రోజురోజుకూ ఏపీలో వైసీపీపై ప్రజలకు విశ్వాసం సన్నగిల్లుతోందన్నారు. ‘ఆంరఽధలో కులాల గీతల మధ్య రాజకీయం చేయాల్సిన పరిస్థితి ఉంది. అక్కడ అధికారంలో ఉన్న వారు మామూలోళ్లు కాదు. సొంత బాబాయినే చంపించుకున్న వాళ్లు. ఏపీలో న్యాయ వ్యవస్థను ఇష్టానుసారంగా తిట్టేవాళ్లున్నారు. ప్రజాస్వామ్యం అనే పదానికి ఆ రాష్ట్రంలో విలువ లేదు. ఇలాంటి నాయకత్వం తెలంగాణలో లేదు’ అని స్పష్టం చేశారు. రాజకీయ కారణాలతోనే ఆంధ్రప్రదేశ్‌లో వారాహి వాహనానికి అనుమతి ఇవ్వలేదని విమర్శించారు.

బీఆర్‌ఎస్‌గా టీఆర్‌ఎస్‌.. స్వాగతిస్తున్నా

టీఆర్‌ఎస్‌ బీఆర్‌ఎస్‌గా ఆవిర్భవించడాన్ని స్వాగతిస్తున్నానని, తెలుగు రాష్ట్రాలు బలంగా ఉండాలని పవన్‌ చెప్పారు. రెండు రాష్ట్రాల్లో సమస్యలు వేర్వేరని.. ఆంధ్రతో తెలంగాణను పోల్చిచూడలేమని, ఆ రాష్ట్రంతో పోల్చితే ఇక్కడ అభివృద్ధి చాలా జరిగిందని తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో మైనింగ్‌ దోపిడీ జరుగుతోందన్నారు. తెలంగాణలో జనసేన 7 నుంచి 14 పార్లమెంటు స్థానాల్లో పోటీ చేస్తుందన్నారు. ఇక్కడి అసెంబ్లీలో పది మంది జనసేన ఎమ్మెల్యేలు ఉండాలని ఆకాంక్షించారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో కచ్చితంగా పర్యటిస్తానన్నారు. తెలంగాణలో చిన్న పోలీసు ఉద్యోగానికి ఇన్ని పరీక్షలు పెడుతున్నారని విమర్శించారు. తెలంగాణ ప్రజలకు సందేశం ఇచ్చే స్థాయిలో తాను లేనన్నారు. చాకలి ఐలమ్మ పోరాటం వల్లే జై తెలంగాణ అంటున్నామని తెలిపారు.

కొండగట్టు నా సెంటిమెంటు

కొండగట్టు ఆలయం తనకు సెంటిమెంట్‌ అని పవన్‌ అన్నారు. ముఖ్యమైన ఏ కార్యక్రమాన్నైనా ఇక్కడి నుంచే ప్రారంభిస్తానని.. అందుకే వారాహికి కూడా ఇక్కడ పూజలు చేయించినట్లు చెప్పారు. కొండగట్టు ఆంజనేయస్వామి దయతో గతంలో తాను ప్రమాదం నుంచి బయటపడ్డానని, అది తనకు పునర్జన్మలాంటిదన్నారు. దేశంలో అన్నిటికంటే సనాతన ధర్మం నిలబడాలని, ధర్మం నిలబెట్టడానికి తాను కట్టుబడి ఉంటానని చెప్పారు. పవన్‌ను చూడడానికి పలు ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో అభిమానులు, పార్టీ కార్యకర్తలు కొండగట్టుకు తరలివచ్చారు. జై జనసేన.. జైజై జనసేన, జై పవన్‌ కల్యాణ్‌, కాబోయే సీఎం పవన్‌ కల్యాణ్‌ అంటూ కార్యకర్తలు జోరుగా నినాదాలు చేశారు. రాత్రికి పవన్‌ ధర్మపురి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి దేవాలయానికి చేరుకున్నారు. ప్రత్యేక పూజలు జరిపారు.

2knr4.jpg

పవన్‌ పర్యటనలో అపశ్రుతి

రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

మరో ముగ్గురికి తీవ్ర గాయాలు

వెల్గటూర్‌, జనవరి 24(ఆంధ్రజ్యోతి): జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పర్యటనలో అపశ్రుతి చోటుచేసుకుంది. పవన్‌ కల్యాణ్‌ కాన్వాయ్‌ని అనుసరిస్తున్న ఓ యువకుడు ఎదురుగా వస్తున్న వాహనాలను ఢీకొని మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసుల కథనం ప్రకారం... వెల్గటూర్‌ మండలం ముక్కట్రావ్‌ పేటకు చెందిన కూస రాజ్‌కుమార్‌(22) ద్విచక్ర వాహనంపై కుమ్మరిపల్లికి చెందిన జక్కుల అంజి అనే మరో యువకుడితో కలిసి పవన్‌ కల్యాణ్‌ కాన్వాయ్‌ని అనుసరిస్తున్నారు. పవన్‌ కల్యాణ్‌ ధర్మపురి పర్యటన ముగించుకొని వెల్గటూర్‌ మీదుగా హైదరాబాద్‌ తిరిగి వెళుతున్నారు. కిషన్‌రావుపేట స్టేజి దాటిన తరువాత పవన్‌ కల్యాణ్‌ కాన్వాయ్‌ని ఓవర్‌టేక్‌ చేయాలని యువకులు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టి, అదే వేగంతో ఎదురుగా వస్తున్న కారును కూడా ఢీ కొట్టారు. ఈ ఘటనలో రాజ్‌కుమార్‌ మృతి చెందాడు. జక్కుల అంజి, వీరు ఢీకొన్న ద్విచక్ర వాహనంపై ఉన్న బొలిశెట్టి శ్రీనివాస్‌, నీలం సాగర్‌లకు కాళ్లు విరిగి తీవ్ర గాయాలయ్యాయి.

Updated Date - 2023-01-25T03:49:00+05:30 IST