Sharmila Verses Jaggareddy: పీక్ స్టేజ్లో మాటల యుద్ధం
ABN , First Publish Date - 2022-09-27T02:56:49+05:30 IST
తెలంగాణలో వైఎస్ఆర్టీపీ (Ysrtp) అధ్యక్షురాలు షర్మిల (Sharmila), కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ( Congress Mla Jaggareddy) మధ్య మాటల యుద్ధం నడుస్తోంది..
హైదరాబాద్: తెలంగాణలో వైఎస్ఆర్టీపీ (Ysrtp) అధ్యక్షురాలు షర్మిల (Sharmila), కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి (Congress Mla Jaggareddy) మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. సంగారెడ్డి జిల్లాలో వైఎస్ షర్మిల ప్రజా ప్రస్థానం (Praja Prastanam) కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జగ్గారెడ్డిపై ఆమె విమర్శలు చేశారు. గతంలో సంగారెడ్డి అభివృద్ధిపై మంత్రులు హామీ ఇచ్చారని.. ఎమ్మెల్యే జగ్గారెడ్డి పోరాటం చేయలేదని మండిపడ్డారు.
దీంతో ఎమ్మెల్యే జగ్గారెడ్డి అంతే రియాక్షన్ ఇచ్చారు. గత పాదయాత్రలో జగనన్న వదిలిన బాణమని షర్మిల చెప్పారని.. ఇప్పుడు వైఎస్ వదిలిన బాణాన్ని అని చెబుతున్నారని జగ్గారెడ్డి ఎద్దేవా చేశారు. ఆనాడు వైఎస్ చనిపోయి అంతా బాధలో ఉంటే.. జగన్, షర్మిల, విజయమ్మ సీఎం ఎవరనేదానిపై చర్చించుకున్నారని గుర్తుచేశారు. ఇప్పుడు వైఎస్ ఫొటో పెట్టుకుని షర్మిల, జగన్.. ఆయన ఆశయాల కోసం పని చేయడం లేదని మండిపడ్డారు. రాహుల్ గాంధీని ప్రధానిని చేయాలనేదే వైఎస్ రాజశేఖర్ రెడ్డి కల అని.. తండ్రి ఆశయాల కోసం షర్మిల ఎందుకు పని చేయడంలేదని ప్రశ్నించారు. ఏపీలో జగన్, తెలంగాణలో షర్మిల బీజేపీ డైరెక్షన్లో పని చేస్తున్నారని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు.
అయితే జగ్గారెడ్డి వ్యాఖ్యలపై తాజాగా షర్మిల ఫైర్ అయ్యారు. జగ్గారెడ్డి మంత్రి కేటీఆర్ కోవర్టు అని వ్యాఖ్యానించారు. ఏమాత్రం జ్ఞానం లేకుండా జగ్గారెడ్డి మాట్లాడుతున్నారని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘మీలాగా పార్టీలు మారే సంస్కృతి వైఎస్ఆర్ది కాదు. జగ్గారెడ్డిని ఎవరు పిలిచినా.. వాళ్ల పార్టీలోకి వెళ్తారు. ప్రజా సమస్యలపై కేసీఆర్ను ఏనాడైనా జగ్గారెడ్డి ప్రశ్నించారా?. సంగారెడ్డి ప్రజలకు జగ్గారెడ్డి ఏం చేశారో చెప్పాలి?.’’ అని షర్మిల డిమాండ్ చేశారు. మరి షర్మిల చేసిన ఈ కామెంట్స్ పై కూడా జగ్గారెడ్డి స్పందిస్తారేమో చూడాలి.