YS Sharmila: బీఆర్ఎస్ అంటే బందిపోట్ల రాష్ట్ర సమితి: షర్మిల
ABN , First Publish Date - 2022-11-07T20:52:03+05:30 IST
కేసీఆర్ స్థాపించిన బీఆర్ఎస్ (BRS) పార్టీ అంటే బందిపోట్ల రాష్ట్ర సమితి అని వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (Sharmila) విమర్శించారు.
మంచిర్యాల: కేసీఆర్ స్థాపించిన బీఆర్ఎస్ (BRS) పార్టీ అంటే బందిపోట్ల రాష్ట్ర సమితి అని వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (Sharmila) విమర్శించారు. రైతులకు మేలు చేయడం చేతకాదు కాని ఇప్పుడు దేశాలు ఏలుతాడట అని కేసీఆర్ (KCR)ను ఉద్దేశించి ఎద్దేవా చేశారు. ప్రజాప్రస్థానం పాదయాత్రలో భాగంగా సోమవారం మంచిర్యాల (Mancherial) జిల్లా నెన్నెల మండలం ఆవడం గ్రామంలో ఆమె ప్రజలతో మాటా-ముచ్చట కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలతో మమేకమై వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ ఎనిమిదేండ్లుగా వివిధ పథకాల పేరు చెప్పి ఒక్కటి అమలు చేయకపోగా ప్రజలను కేసీఆర్ మోసగిస్తూ వస్తున్నాడని ఆరోపించారు. పెన్షన్, పోడు పట్టాలు పూర్తిగా మోసపూరితమైనవని విమర్శించారు. దళితులను పూర్తిగా మోసం చేసిన ఘనత కేసీఆర్కే దక్కిందన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా 20 లక్షల దళిత కుటుంబాలు ఉన్నాయని, దళిత ముఖ్యమంత్రి దగ్గర నుంచి మంత్రివర్గంలో స్థానం కల్పించే వరకు ఆ వర్గం ప్రజలపై చిన్నచూపు చూస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దళితబంధు కింద ఎంత మందికి లబ్ధి చేకూర్చారో బయటపెట్టాలని ఆమె డిమాండ్ చేశారు. దళితులకు మూడెకరాల భూమి అని చెప్పిన కేసీఆర్ ఒక్క కుటుంబానికైనా ఇచ్చారా అని ప్రశ్నించారు. వైఎస్ఆర్ హయాంలో వ్యవసాయానికి పెద్దపీట వేశారన్నారు. ఇప్పుడు రైతు 59 ఏండ్లలోపు చనిపోవాలని మరణశాసనం రాశాడని, రైతు బీమా పథకం విధి విధానాలు దీనిని రుజువు చేస్తున్నాయని చెప్పారు. దిక్కుమాలిన కేసీఆర్ పాలనలో పంట నష్టపోతే పరిహారం ఇచ్చే దిక్కు లేదని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read more