సీబీఐ, ఈడీ కేసులపై.. జగతి, విజయసాయి పిటిషన్ల ఉపసంహరణ
ABN , First Publish Date - 2022-09-10T09:00:04+05:30 IST
సీఎం జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల వ్యవహారంలో సీబీఐ, ఈడీ కేసులను కలిపి విచారించేలా సీబీఐ కోర్టుకు ఆదేశాలివ్వాలని కోరుతూ దాఖలు..
కార్మెల్ ఏషియా సంస్థ కూడా.. సుప్రీంకోర్టుకు నివేదన
తెలంగాణ హైకోర్టులో ఊరట లభించినట్లు వెల్లడి
న్యూఢిల్లీ, సెప్టెంబరు 9 (ఆంధ్రజ్యోతి): సీఎం జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల వ్యవహారంలో సీబీఐ, ఈడీ కేసులను కలిపి విచారించేలా సీబీఐ కోర్టుకు ఆదేశాలివ్వాలని కోరుతూ దాఖలు చేసుకున్న పిటిషన్లను ఏ-2 నిందితుడు విజయసాయిరెడ్డి, జగతి పబ్లికేషన్స్, కార్మెల్ ఏషియా హోల్డింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ఉపసంహరించుకున్నాయి. జగతి పబ్లికేషన్స్, విజయసాయిరెడ్డి, కార్మెల్ ఏషియా దాఖలు చేసిన 6 పిటిషన్లు, భారతి సిమెంట్స్ కార్పొరేషన్ దాఖలు చేసిన పిటిషన్ శుక్రవారం జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ జేకే మహేశ్వరితో కూడిన ద్విసభ్య ధర్మాసనం ముందు విచారణకు వచ్చాయి. ఈ అంశంపై తెలంగాణ హైకోర్టులో తమకు గురువారం ఊరట లభించిందని, కాబట్టి పిటిషన్లను ఉపసంహరించుకుంటున్నట్లు పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ ధర్మాసనానికి తెలియజేశారు. భారతి సిమెంట్స్ మాత్రం పిటిషన్ను ఉపసంహరించుకోలేదు. గతంలో ఓ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు విరుద్ధంగా హైకోర్టు తీర్పు ఇచ్చిందని, కాబట్టి పిటిషన్ను ఉపసంహరించుకోవడం లేదని ఆ సంస్థ తరఫు సీనియర్ న్యాయవాది కపిల్ సిబ్బల్ తెలిపారు.