నాన్నలాగే నన్ను కూడా కుట్ర చేసి చంపుతారేమో?

ABN , First Publish Date - 2022-09-19T08:47:58+05:30 IST

‘దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్‌ను కుట్ర చేసి చంపారు. నన్ను కూడా అలాగే చంపుతారేమో..

నాన్నలాగే  నన్ను కూడా కుట్ర చేసి చంపుతారేమో?

  • వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల.. 
  • బేడీలు చూపుతూ దమ్ముంటే అరెస్టు చేయాలని సవాల్‌ఛ

మహబూబ్‌నగర్‌, జడ్చర్ల (ఆంధ్రజ్యోతి), సెప్టెంబరు 18 : ‘దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్‌ను కుట్ర చేసి చంపారు. నన్ను కూడా అలాగే చంపుతారేమో.. కానీ నా ఊపిరి ఉన్నంత వరకు ప్రజల నుంచి వేరు చేయడం ఎవరి తరం కాదు’ అంటూ వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేల అవినీతిపై మాట్లాడకుండా తన గొంతు నొక్కుతున్నారని ధ్వజమెత్తారు. ‘గుర్తుంచుకోండి కేసీఆర్‌... నా పేరు షర్మిల, వైఎస్సార్‌ బిడ్డని, ఈ బేడీలంటే నాకు భయమా, ఈ బేడీలు నన్ను ఆపుతాయా, మీకు దమ్ముందా, నన్ను అరెస్ట్‌ చేస్తారా? నన్ను అరెస్ట్‌ చేయండి’ అని బేడీలు చూపుతూ సవాల్‌ విసిరారు. ఆమె చేపట్టిన ప్రజాప్రస్థానం పాదయాత్ర ఆదివారం మహబూబ్‌నగర్‌ జిల్లా బాలానగర్‌ మండలం మోదంపల్లి, పెద్దరేవల్లి, బోడగుట్టతండా, గౌతాపూర్‌, బాలానగర్‌, మోతీఘనపూర్‌లలో కొనసాగింది. ఈ సందర్భంగా జిల్లెలగడ్డ తండా వద్ద ఆమె మీడియాతో మాట్లాడారు. ‘మీ పోలీసులను పంపించండి.. కేసులు పెట్టారు కదా. కంప్లైంట్లు చేశారు కదా, నేను రెడీ, మీరు రెడీయా..’ అన్నారు. మీకు పోలీసులుంటే, నాకు ప్రజలున్నారు. నాకు బేడీలంటే భయంలేదు. నేను జనంలో ఉన్నానని, జనం కోసమే పాదయాత్ర చేస్తున్నానని ఆమె చెప్పారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర నాయకులు రాంరెడ్డి, ఏపూరి సోమన్న, సత్యవతి, సరోజ్‌రెడ్డి పాల్గొన్నారు. కాగా, మహబూబ్‌నగర్‌ జిల్లాలో షర్మిల పాదయాత్ర ముగిసింది. సోమవారం నుంచి రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో పర్యటించనున్నారు. 

Updated Date - 2022-09-19T08:47:58+05:30 IST