మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకుంటారా?
ABN , First Publish Date - 2022-02-19T07:28:27+05:30 IST
కృష్ణా జలాల పంపిణీ వివాదాన్ని మధ్యవర్తిత్వం ద్వారా
- కృష్ణా జలాలపై సీజేఐ జస్టిస్ రమణ ప్రశ్న
న్యూఢిల్లీ,ఫిబ్రవరి 18(ఆంధ్రజ్యోతి): కృష్ణా జలాల పంపిణీ వివాదాన్ని మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోగలా అని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ప్రశ్నించారు. కృష్ణా జలాల పంపిణీపై 2010లో బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ఉమ్మడి ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించగా.. గెజిట్లో ప్రచురించవద్దని సుప్రీంకోర్టు స్టే విధించింది.
2011 నవంబరు 16న ఇచ్చిన ఆ స్టేను ఎత్తివేసి గెజిట్లో తీర్పును ప్రచురించడానికి అనుమతించాలని కోరుతూ కర్ణాటక ప్రభుత్వం ఇంటర్లొకేటరీ అప్లికేషన్ దాఖలు చేసింది. ఈ ఏడాది జనవరి 10న.. ఆ కేసు విచారణ నుంచి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఏ ఎస్ బోపన్న తప్పుకొన్న సంగతి తెలిసిందే. దాంతో కేసు విచారణకు ధర్మాసనాన్ని ఏర్పాటు చేయాలంటూ కర్ణాటక తరఫున సీనియర్ న్యాయవాది శ్యామ్ దివాన్ జస్టిస్ రమణ నేతృత్వంలోని ధర్మాసనం ముందు ప్రస్తావించారు. ఈ కేసుకు విచారణ అవసరమని, విచారణ ద్వారా అంతిమ నిర్ణయం కావాలని దివాన్ బదులిచ్చారు. కాగా, కర్నాటక ప్రభుత్వం చేసిన ఈ విజ్ఞప్తి పరిశీలిస్తానని జస్టిస్ రమణ స్పష్టం చేశారు.