అంధ విద్యార్థుల హాస్టళ్లలో వసతులు కల్పిస్తున్నాం..: సర్కారు
ABN , First Publish Date - 2022-06-07T08:50:18+05:30 IST
అంధ విద్యార్థుల హాస్టళ్లలో వసతులు కల్పిస్తున్నాం..: సర్కారు
హైదరాబాద్, జూన్ 6 (ఆంధ్రజ్యోతి): అంధులైన బాలబాలికల కోసం ప్రత్యేకంగా నిర్వహిస్తున్న పాఠశాల, హాస్టళ్లలో వసతులు కల్పించడానికి చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. బహదూర్పురా, మలక్పేటల్లోని అంధుల పాఠశాల, హాస్టళ్లలో విద్యార్థుల ఇబ్బందులపై పత్రికల్లో వచ్చిన కథనాలను హైకోర్టు గతంలో సుమోటో పిటిషన్గా విచారణకు స్వీకరించింది. సోమవారం దీనిపై చీఫ్ జస్టిస్ సతీశ్చంద్ర శర్మ, జస్టిస్ అభినందన్కుమార్ షావిలి ధర్మాసనం విచారణ చేపట్టింది. ఆయా కేంద్రాల్లో చేపడుతున్న పనులకు సంబంధించిన వివరాలతో దివ్యాంగులు, సీనియర్ సిటిజన్స్ సంక్షేమశాఖ హైకోర్టుకు అఫిడవిట్ను అందజేసింది. వాదనలు నమోదు చేసుకున్న ధర్మాసనం.. దివ్యాంగుల కోసం ’బీ మై ఐస్’ వంటి అప్లికేషన్ల వినియోగంపై అవగాహన పెంపొందించాలని సూచించింది. ఈ కేసులో అమికస్ క్యూరీగా ఉన్న సీనియర్ న్యాయవాది ఎల్ రవిచందర్ వాదనలు వినిపిస్తూ... ప్రభుత్వం అన్ని వసతులు ఉన్నట్లు చెప్తున్నప్పటికీ అమలులో సమస్యలు ఉన్నాయని తెలిపారు. వాదనలు నమోదు చేసుకున్న ధర్మాసనం.. సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం సమగ్రంగా చర్యలు తీసుకోవాలని.. ఈ మేరకు అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది.