పారిశుధ్య కార్మికులకు రూ.21వేల వేతనం చెల్లించాలి
ABN , First Publish Date - 2022-12-08T00:06:04+05:30 IST
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తరహాలో తెలంగాణలో పారిశుధ్య కార్మికులకు రూ.21వేల వేతనం చెల్లించాలని సీఐటీయూ, టీ-ఎంఆర్పీఎస్ సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేశారు. కార్మికుల సమస్యల పరిష్కారంపై బుధవారం హనుమకొండలోని బల్దియా ప్రధాన కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.
బల్దియా కార్యాలయం వద్ద ధర్నా
జీడబ్ల్యూఎంసీ(హనుమకొండ సిటీ), డిసెంబరు 7 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తరహాలో తెలంగాణలో పారిశుధ్య కార్మికులకు రూ.21వేల వేతనం చెల్లించాలని సీఐటీయూ, టీ-ఎంఆర్పీఎస్ సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేశారు. కార్మికుల సమస్యల పరిష్కారంపై బుధవారం హనుమకొండలోని బల్దియా ప్రధాన కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన టీ-ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు బొట్ల భిక్షపతి, సీఐటీయూ మునిసిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా కార్యదర్శి టి.ఉప్పలయ్య మాట్లాడారు.
రాష్ట్ర ప్రభుత్వం పారిశుధ్య కార్మికుల శ్రమను దోపిడీ చేస్తోందన్నారు. పనికి తగిన వేతనాలు చెల్లించడం లేదన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కార్మికులకు చెల్లిస్తున్న వేతనాల తరహాలో తెలంగాణలో కూడా ఇవ్వాలని స్పష్టం చేశారు. కార్మికుల సంక్షేమం పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. కార్మికులకు చలి దస్తులు ఇవ్వడం లేదన్నారు. చెప్పులు, నూనె, చీపుర్లు ఇవ్వడాన్ని మరిచారని మండిపడ్డారు. మృతిచెందిన కార్మికుల కుటుంబ సభ్యులకు ఉద్యోగం కల్పించడంలో జాప్యం జరుగుతోందన్నారు. కార్మికుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలని, లేని పక్షంలో ఆందోళనలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జన్ను ప్రకాశ్, సింగారపు బాబు, మున్నంగి రఘు, మూర్తిరాజు, రాజారపు భాస్కర్, ఏలియా, దామోదర్, మహేశ్, వెంకటస్వామి, బాబు, నవనీత, సువర్ణ, రాజు తదితరులు పాల్గొన్నారు.