కరీంనగర్లో వెంకన్న ఆలయం
ABN , First Publish Date - 2022-03-16T09:12:32+05:30 IST
కరీంనగర్ పట్టణంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మాణం కాబోతుంది.
- 10 ఎకరాల స్థలాన్ని కేటాయించిన సీఎం
- మంత్రి గంగులకు పత్రాలు అందజేసిన కేసీఆర్
హైదరాబాద్, మార్చి 15 (ఆంధ్రజ్యోతి): కరీంనగర్ పట్టణంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మాణం కాబోతుంది. ఆలయ నిర్మాణానికి అవసరమైన 10 ఎకరాల భూమిని సీఎం కేసీఆర్ కేటాయించారు. స్థల కేటాయింపునకు సంబంధించిన పత్రాల్ని సీఎం కేసీఆర్ అసెంబ్లీలోని తన చాంబర్లో మంత్రి గంగుల కమలాకర్తోపాటు టీటీడీ హైదరాబాద్ లోకల్ అడ్వైజరీ కమిటీ ఛైర్మన్ జీవీ భాస్కర్ రావుకు మంగళవారం అందజేశారు. యాదాద్రిని అద్భుతంగా తీర్చిదిద్దుతున్న సీఎం కేసీఆర్.. టీటీడీ ఆధ్వర్యంలో వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి కరీంనగర్ పట్టణం నడిబొడ్డున స్థలం కేటాయించడం పట్ల మంత్రి గంగుల ఆనందం వ్యక్తం చేశారు. ఆలయాన్ని ఏడాదిన్నర కాలంలోనే భక్తులకు అందుబాటులోకి తెస్తామని చెప్పారు.