నేడే బీఆర్‌ఎస్‌

ABN , First Publish Date - 2022-10-05T08:25:22+05:30 IST

తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్‌).. భారత రాష్ట్రీయ సమితి (బీఆర్‌ఎ్‌స)గా మారేందుకు సర్వం సిద్ధమైంది.

నేడే బీఆర్‌ఎస్‌

  • జాతీయ పార్టీగా మారనున్న టీఆర్‌ఎస్‌
  • తెలుగుసంఘాల నేత కృష్ణారావుకు ఆహ్వానం
  • బీఆర్‌ఎస్‌గా ప్రకటించగానే పార్టీ అనుబంధ సంఘాల ఏర్పాటు..
  • తొలుత కిసాన్‌ సంఘ్‌
  • ఢిల్లీలో ఇప్పటికే జాతీయ పార్టీకి ఆఫీస్‌!
  • 9న సమావేశం నిర్వహించనున్న నేతలు

హైదరాబాద్‌, అక్టోబరు 4, (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్‌)..  భారత రాష్ట్రీయ సమితి (బీఆర్‌ఎ్‌స)గా మారేందుకు సర్వం సిద్ధమైంది. పార్టీ పేరు, పరిధిని మార్చేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను ఆ పార్టీ అధినేత కేసీఆర్‌ చేసేశారు. బుధవారం ఉదయం 11 గంటలకు తొలుత రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ల చైర్మన్లతో కూడిన పార్టీ సర్వసభ్య సమావేశం తెలంగాణ భవన్‌లో జరగనుంది. సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో పార్టీని జాతీయ స్థాయికి ఎందుకు తీసుకెళ్లాల్సి వస్తోంది, దేశంలో ఉన్న రాజకీయ పరిస్థితులేంటి అన్నది వివరిస్తారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ విధానాలు, ప్రాంతీయ పార్టీల పట్ల ఆ పార్టీ వైఖరిని వివరించనున్నారు. తమ జాతీయ పార్టీ లక్ష్యాలు, అజెండాను వెల్లడించనున్నారు. అనంతరం సర్వసభ్య సమావేశానికి హాజరుకానున్న మొత్తం 283 మంది.. టీఆర్‌ఎస్‌ పార్టీ మార్పునకు సంబంధించిన తీర్మానంపై సంతకాలు చేస్తారు. మధ్యాహ్నం 1.19 గంటలకు కేసీఆర్‌ నోట జాతీయ పార్టీగా ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటన రానుంది. అనంతరం సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న వారందరితో కలిసి భోజనం చేశాక.. విలేకరుల సమావేశం నిర్వహించే అవకాశాలున్నాయి. కాగా, పార్టీ పేరు, పరిఽధి తప్ప.. పార్టీ జెండా ఇప్పుడున్నట్లు గులాబీ రంగులోనే ఉంటుంది. ఒకరకంగా చెప్పాలంటే ఇప్పుడున్న జెండానే ఉండనుంది. పార్టీ గుర్తు కూడా కారు గుర్తే ఉంటుంది. 


జేడీఎస్‌ నేతల రాక..

బీఆర్‌ఎస్‌ ఏర్పాటు కార్యక్రమానికి రావాల్సిందిగా పలు రాష్ట్రాల్లోని వివిధ పార్టీల నేతలకు కేసీఆర్‌ ఆహ్వానాలు పంపించారు. ఈ మేరకు కర్ణాటక నుంచి జేడీఎస్‌ నేత, మాజీ సీఎం కుమారస్వామి, మాజీ మంత్రి రేవణ్ణతోపాటు ఆ పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు, సీనియర్‌ నేతలు ఇప్పటికే హైదరాబాద్‌ చేరుకున్నారు. వీరికి టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, ప్రభుత్వ చీఫ్‌ విప్‌ బాల్క సుమన్‌, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌ తదితరులు బేగంపేట విమానాశ్రయంలో స్వాగతం పలికారు. మరోవైపు తమిళనాడు నుంచి విదుతలై చిరుతైగల్‌ కచ్చి (వీసీకే) వ్యవస్థాపక అధ్యక్షుడు, చిదంబరం ఎంపీ తిరుమావళవన్‌ కూడా వచ్చారు. ఈయన ఒకసారి ఎమ్మెల్యేగా, మూడుసార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. ఈయనతోపాటు సీఎం ఆహ్వానం అందుకున్నవారిలో తమిళనాడు తెలుగు సంఘాల్లో కీలకపాత్ర పోషిస్తున్న ద్రావిడ దేశం వ్యవస్థాపక అధ్యక్షుడు కృష్ణారావు కూడా ఉన్నారు. వీరిద్దరికి ప్రగతిభవన్‌ ముందున్న ఐటీసీ కాకతీయ హోటల్లో బస ఏర్పాటుచేశారు. అదే సమయంలో కొందరు జాతీయ రైతు సంఘం ప్రతినిధులు కూడా ఈ కార్యక్రమం కోసం వచ్చారు. తన ఆహ్వానం మేరకు వచ్చిన నేతలతో బుధవారం ఉదయం ప్రగతిభవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ అల్పాహార విందు ఇవ్వనున్నారు. 


తీర్మానాన్ని ఢిల్లీ తీసుకెళ్లనున్న వినోద్‌కుమార్‌

టీఆర్‌ఎస్‌ పేరును బీఆర్‌ఎ్‌సగా మారుస్తూ చేసిన తీర్మానాన్ని పార్టీ సీనియర్‌ నేత, రాష్ట్ర ప్రణాళికా బోర్డు ఉపాధ్యక్షుడు బి. వినోద్‌కుమార్‌ బృందం ఢిల్లీకి తీసుకెళ్లనుంది. కేసీఆర్‌ కొనుగోలు చేసిన చార్టర్డ్‌ విమానంలో ఈ నెల 6న వీరు ఢిల్లీ వెళ్లి కేంద్ర ఎన్నికల సంఘానికి ఈ తీర్మానాన్ని సమర్పిస్తారు. ఈసీఐ దీనిని పరిశీలించి ఆమోదం తెలపగానే బీఆర్‌ఎస్‌ ప్రస్థానం మొదలవుతుంది. కాగా, జాతీయ పార్టీగా మారిన అనంతరం అఖిల భారత స్థాయిలో కొన్ని అనుబంధ సంఘాలను ఏర్పాటు చేయాలని కేసీఆర్‌ నిర్ణయించినట్లు సమాచారం. ఇందులో భాగంగా తొలుత కిసాన్‌ సంఘ్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే అనేకమంది రైతు సంఘాల ప్రతినిధులతో కేసీఆర్‌ చర్చలు జరిపారు. వారంతా హైదరాబాద్‌కు వచ్చి కేసీఆర్‌తో సమావేశమయ్యారు. వివిధ రాష్ట్రాలకు చెందిన రైతు నేతలందరి సహకారంతో కిసాన్‌సం్‌ఘను ఏర్పాటు చేయనున్నారు. తెలంగాణలో అమలవుతున్న రైతుబంధు, ఉచిత విద్యు త్తు తదితర కార్యక్రమాలను దేశమంతటా ఆ సంఘం ద్వారా ప్రచారం చేయనున్నట్లు తెలిసింది. మరోవైపు జాతీయ పార్టీ కార్యకలాపాల కోసం ఢిల్లీలో ఇప్పటికే ఒక కార్యాలయాన్ని కేసీఆర్‌ అద్దెకు తీసుకున్నట్లు సమాచారం. ఈ నెల 9న ఈ కార్యాలయంలో ఒక సమావేశం కూడా టీఆర్‌ఎస్‌ నేతలు నిర్వహించనున్నారు.

Updated Date - 2022-10-05T08:25:22+05:30 IST