టీఆర్ఎస్ది అరాచక పాలన
ABN , First Publish Date - 2022-06-07T09:15:34+05:30 IST
టీఆర్ఎస్ది అరాచక పాలన
కేసీఆర్ మాయమాటలు నమ్మొద్దు: జానారెడ్డి
గుర్రంపోడు, జూన్ 6: టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకిచ్చిన హామీలను మరిచి.. అరాచక, నియంతృత్వ పాలన సాగిస్తోందని సీఎల్పీ మాజీ నేత కుందూరు జానారెడ్డి విమర్శించారు. కేసీఆర్ మాయమాటలు నమ్మి 2014 లో ఆయనకు అధికారమిస్తే రైతుల రూ.లక్ష రుణమాఫీ, దళితులకు మూడెకరాల భూమి, నిరుద్యోగ భృతి, డబుల్ బెడ్రూంఇళ్లు లాంటి హామీ ల అమలును విస్మరించారని ఆరోపించారు. సోమవారం నల్లగొండ జిల్లా గుర్రంపోడు మండలంలో జరిగిన రచ్చబండలో జానారెడ్డి మాట్లాడారు. ఓవైపు అన్ని వస్తువుల ధరలు పెంచి రైతుబంధుకు మాత్రం రూ.5 వేలు ఇస్తే ఏం లాభమని ప్రశ్నించారు. సర్పంచులకు నిధుల్లేవని, పనులు చేయలేక కాంట్రాక్టర్లు పారిపోతున్నారని అన్నారు. అక్రమంగా సంపాదించిన డబ్బుతో మళ్లీ అధికారంలోకి రావాలని టీఆర్ఎస్ యత్నిస్తోందని, ప్రజలు మళ్లీ మోసపోతే రాష్ర్టాన్ని తాకట్టు పెట్టిన వారవుతారని హెచ్చరించారు.