ఢీ అంటే ఢీ..!
ABN , First Publish Date - 2022-11-25T03:34:18+05:30 IST
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పోరు తారస్థాయికి చేరుతోంది. కేంద్రంలోని బీజేపీ సర్కారు లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం స్పీడు పెంచింది.
కేంద్రం వర్సెస్ రాష్ట్రం
హైదరాబాద్, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పోరు తారస్థాయికి చేరుతోంది. కేంద్రంలోని బీజేపీ సర్కారు లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం స్పీడు పెంచింది. మంత్రి మల్లారెడ్డికి సంబంధించి ఐటీ సోదాల ఎపిసోడ్తోనే కేంద్రప్రభుత్వ ఉద్యోగులపై కేసుల నమోదుకు బీజం వేసింది. పోలీసు, ఏసీబీ కేసుల్ని అస్త్రంగా చేసుకుని కేంద్ర ప్రభుత్వ సంస్థల ఉద్యోగులపై నేరుగా విరుచుకుపడేందుకు సిద్ధమైంది. దానికి తగ్గట్లుగానే మంత్రి మల్లారెడ్డి కుమారుడు కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఐటీ అధికారిపై పోలీసులకు ఫిర్యాదు చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే తగ్గేదే లే.. అన్నట్లుగా మంత్రి మల్లారెడ్డిపై ఐటీ అధికారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మంత్రి కుమారుడు, ఐటీ అధికారి పరస్పర ఫిర్యాదులు ఇప్పుడు రాష్ట్రంతోపాటు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.