బీసీల రిజర్వేషన్లను 50%కి పెంచాలి
ABN , First Publish Date - 2022-11-25T03:55:30+05:30 IST
బీసీల జనాభా ప్రకారం విద్య, ఉద్యోగ రిజర్వేషన్లను 27శాతం నుంచి 50శాతానికి పెంచాలని డిమాండ్ చేస్తూ గురువారం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆర్.కృష్ణయ్య ఆధ్వర్యంలో జాతీయ బీసీ సంఘం ధర్నా చేపట్టింది.
జంతర్ మంతర్ వద్ద జాతీయ బీసీ సంఘం ధర్నా
న్యూఢిల్లీ, నవంబరు 24(ఆంధ్రజ్యోతి): బీసీల జనాభా ప్రకారం విద్య, ఉద్యోగ రిజర్వేషన్లను 27శాతం నుంచి 50శాతానికి పెంచాలని డిమాండ్ చేస్తూ గురువారం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆర్.కృష్ణయ్య ఆధ్వర్యంలో జాతీయ బీసీ సంఘం ధర్నా చేపట్టింది. ముఖ్యఅతిథులుగా టీఆర్ఎస్ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ హాజరై మద్దతు తెలిపారు. అనంతరం ఆర్.కృష్ణయ్య విలేకరులతో మాట్లాడారు. సుప్రీంకోర్టు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను సమర్థిస్తూ తీర్పు చెప్పిన నేపథ్యంలో జనాభా ప్రకారం విద్య, ఉద్యోగ రంగాలతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 27శాతం నుంచి 50శాతానికి రిజర్వేషన్లను పెంచాలని, చట్టసభలలో కూడా బీసీలకు 50 శాతం రిజర్వేషన్లను కల్పిస్తూ పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు.