యాదవుల అభివృద్ధికి టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి
ABN , First Publish Date - 2022-08-01T08:11:53+05:30 IST
రాష్ట్రంలో యాదవుల అభివృద్ధికి టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తోందని, యాదవులకు రూ. 93 వేల మేర రాయితీ ఇచ్చిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని మంత్రులు ఎర్రబెల్లి...
అన్ని రంగాల అభివృద్ధి టీఆర్ఎస్తోనే సాధ్యం
మంత్రులు ఎర్రబెల్లి, తలసాని స్పష్టీకరణ
భీమారం, జూలై 31: రాష్ట్రంలో యాదవుల అభివృద్ధికి టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తోందని, యాదవులకు రూ. 93 వేల మేర రాయితీ ఇచ్చిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ తాజాగా స్పష్టం చేశారు. కుడా చైర్మన్గా సుందర్రాజ్ యాదవ్ నియమితుడైన సందర్భంగా హనుమకొండలోని కేఎల్ఎన్ ఫంక్షన్హాలులో ఆదివారం ఘనంగా జరిగిన ఆత్మీయ సన్మాన వేడుకల్లో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇరువురు మంత్రులు మాట్లాడారు.
‘‘యాదవ కుల అభివృద్ధి కోసం హైదరాబాద్ కోకాపేటలో యాదవ భవన నిర్మాణం జరుగుతోంది. అదే విధంగా యాదవులకు గొర్రెల బీమాతో పాటు సబ్సిడీతో గొర్రెల పంపిణీ చేసిన ఘనత కేసీఆర్దే’’ అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కొనియాడారు. మరోవైపు.. రూ. 5వేల కోట్లతో యాదవులకు గొర్రెల పంపిణీ పథకం ప్రారంభించడం ద్వారా వారి ఎదుగుదలకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో కృషి చేసిందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు స్పష్టం చేశారు. సుందర్రాజ్ తెలంగాణ ఉద్యమకారుడు కనుకనే కుడా చైర్మన్ పదవి ఆయన్ను వరించిందని తెలిపారు. ఇదిలా ఉండగా యాదవుల గురించి పూర్తిస్థాయిలో మాట్లాడకుండా కేవలం ప్రభుత్వ పథకాల గురించి మాట్లాడడంపై యాదవులు అసంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం సుందరాజ్కు ఘనంగా సన్మానం జరిగింది.