చినుకు పడితే ఇక్కట్లే

ABN , First Publish Date - 2022-09-13T16:16:33+05:30 IST

చినుకు పడితే ఇక్కట్లే

చినుకు పడితే ఇక్కట్లే

ఐటీ కారిడార్‌లో ట్రా‘ఫికర్‌’  

3 కిలోమీటర్లకు 30 నిమిషాలు


హైదరాబాద్‌ సిటీ, (ఆంధ్రజ్యోతి): చిన్న వర్షానికే సైబరాబాద్‌, ఐటీకారిడార్‌ పరిధిలోని రోడ్లన్నీ జలమయం అవుతున్నాయి. చాలాప్రాంతాల్లో చినుకు పడితే ఇక్కట్లే అన్నట్లుగా ఉంది పరిస్థితి. జీహెచ్‌ఎంసీ, ట్రాఫిక్‌ పోలీసులు సహా పలు శాఖల మధ్య సమన్వయలోపంతో వర్షాల కారణంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో సోమవారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయం అయ్యాయి. సరిగ్గా ఉద్యోగులు ఇళ్లకు వెళ్లే సమయం కావడంతో ఐటీ కారిడార్‌లో వాహనాలు ఒక్కసారిగా రోడ్లమీదకు వచ్చాయి. దాంతో గచ్చిబౌలి, రాయదుర్గం ప్రాంతంలో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. దాంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గచ్చిబౌలి నుంచి రాయదుర్గం వైపు వెళ్లే వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. రోడ్లపైకి వర్షం నీరు చేరడంతోపాటు, సీపీ కార్యాలయం సమీపంలోని పిస్తాహౌజ్‌ వద్ద రోడ్డు ఇరుకుగా ఉండటం, పక్కనే బయోడైవర్సిటీ వంతెన కింద నుంచి వెళ్లే మరో వంతెన ఉండటంతో ఐకియా, మాదాపూర్‌ వైపు వెళ్లే వాహనాలతో ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. మరోవైపు దివ్యశ్రీ ఎదురుగా ఉన్న బస్టాప్‌ నుంచి రాయదుర్గం పోలీస్‌ స్టేషన్‌ సమీపంలోని ఖాజాగూడ సిగ్నల్‌ వరకూ  భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయింది. మైహోం భుజా వైపు నుంచి వచ్చే వాహనాలు కొండ మధ్యలోంచి వేసిన రోడ్డు మీదుగా వచ్చి రాయదుర్గం వద్ద కలవడంతో అటు గచ్చిబౌలి నుంచి వచ్చే వాహనాలతో ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. దాంతో సాయంత్రం వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గచ్చిబౌలి నుంచి రాయదుర్గం మధ్యలో రెండు ఫ్లై ఓవర్స్‌ ఉన్నప్పటికీ సుమారు మూడు కి.మీ. దూరం ప్రయాణించడానికి 25-30 నిమిషాల సమయం పట్టడంతో వాహనదారులు తీవ్ర అసహనానికి గురయ్యారు. 

Updated Date - 2022-09-13T16:16:33+05:30 IST