నూకల ఎగుమతి రద్దుతో రైతుల ఆదాయానికి గండి
ABN , First Publish Date - 2022-09-11T09:19:46+05:30 IST
నూకల ఎగుమతి రద్దుతో రైతుల ఆదాయానికి గండి
కేంద్రానివి తలాతోక లేని విధానాలు
వరి పండించే రాష్ట్ర అన్నదాతల నడ్డి విరిచింది
రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు ధ్వజం
పటాన్చెరు, సెప్టెంబరు 10: తలాతోక లేని కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ విధానం రైతుల పాలిట శాపంగా మారిందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు విమర్శించారు. ఈ అసంబద్ధ నిర్ణయాలు రైతుల పాలిట శాపంగా మారాయని ధ్వజమెత్తారు. దేశంలో ఆహార కొరత తలెత్తనంతగా ఎఫ్సీఐ గోదాంల నిండా బియ్యం/ధాన్యం ఉన్నా, నూకల ఎగుమతిపై నిషేధం విఽధించడం ఏమిటని ప్రశ్నించారు. ఇది ఉద్దేశపూర్వకంగా రైతులను ఆర్ధికంగా నష్టపరచడమేనని మండిపడ్డారు. పంటలు పండించకుండా అన్నదాతల మనోస్థైర్యాన్ని నీరుగార్చి భవిష్యత్తులో ఆహార కొరత ఏర్పడేలా కేంద్రం వ్యవహరిస్తోందని ఆరోపించారు. శనివారం సంగారెడ్డి జిల్లా పటాన్చెరు వ్యవసాయ మార్కెట్ యార్డు కొత్త కమిటీ ప్రమాణ స్వీకారానికి హరీశ్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రైతులను సంపన్నులను చేస్తామని ప్రగల్బాలు పలికిన ప్రధాని మోదీ.. పరోక్షంగా, వారు ఆత్మహత్యలు చేసుకునేలా వ్యవహరిస్తున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం నూకల ఎగమతిని రద్దు చేసి వరి పండించే తెలంగాణ రైతుల నడ్డి విరిచిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలోనే రికార్డు స్థాయిలో వరిని పండిస్తున్న రాష్ట్ర రైతులను ప్రోత్సహించాల్సింది పోయి అడ్డంకులు సృష్టిస్తున్న కేంద్రం వైఖరి దారుణమని పేర్కొన్నారు. కేంద్రం సహకారం లేకుండానే ప్రాజెక్టులు నిర్మించుకుని వరి పండిస్తే కనీస తోడ్పాటు కరవైందన్నారు. సగం దేశానికి అన్నం పెట్టే సత్తా తెలంగాణ రైతాంగానిదని కొనియాడారు. వడ్లు కొనాల్సిందే అని సీఎం కేసీఆర్ ఢిల్లీలో ఆందోళన చేస్తే కనీస స్పందన లేకపోవడం వారి వ్యవసాయ విధానాన్ని స్పష్టం చేస్తుందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలోని 23 జిల్లాల్లో 72 లక్షల ఎకరాల్లో వరి పండిస్తే, తెలంగాణలో 65 లక్షల ఎకరాల్లో వరి సాగుతో రికార్డులు బద్దలు కొట్టినట్లు చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఎంపీ కొత్తప్రభాకర్రెడ్డి, ఎమ్మెల్యే మహిపాల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.