మరో ఐదు రోజుల్లో నైరుతి రుతుపవనాలు!
ABN , First Publish Date - 2022-06-11T08:40:03+05:30 IST
రాష్ట్రంలోని నైరుతి రుతుపవనాలు ప్రవేశించడానికి మరో ఐదు రోజులు పట్టే అవకాశాలు ఉన్నాయి.
హైదరాబాద్, జూన్ 10 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని నైరుతి రుతుపవనాలు ప్రవేశించడానికి మరో ఐదు రోజులు పట్టే అవకాశాలు ఉన్నాయి. ఈనెల 8 తేదీనే రుతుపవనాలు రావాల్సి ఉండగా ఇప్పటికే రెండు రోజులు దాటిపోయింది. మరో ఐదు రోజులు ఆలస్యమయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ కె.నాగరత్న తెలిపారు. తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో నైరుతి రతుపవనాలు ప్రవేశించినప్పటికీ పూర్తిస్థాయిలో విస్తరించలేదని, దీంతో రాష్ట్రంలో రుతుపవనాలు ఐదు రోజులు ఆలస్యంగా ప్రవేశించవచ్చని ఆమె చెప్పారు. శుక్రవారం నైరుతి రుతుపవనాలు గోవా, కొంకణ్, కర్ణాటకలోని మరికొన్ని ప్రాంతాల్లో ప్రవేశించాయని వెల్లడించారు. రాగల 48 గంటల్లో దక్షిణ మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్లోని మరికొన్ని ప్రాంతాల్లో ముందుకు సాగటానికి అనుకూల పరిస్థితులు ఉందని, దీంతో వచ్చే మూడు రోజులు తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవవచ్చని ఆమె వివరించారు.