ఈడీ అధికారులు తీవ్రంగా కొట్టారు...

ABN , First Publish Date - 2022-11-25T03:05:16+05:30 IST

ఈడీ అధికారులు తనను తీవ్రంగా కొట్టారని, థర్డ్‌ డిగ్రీ ప్రయోగించారని పేర్కొంటూ ట్రైడెంట్‌ కెమ్‌ఫార్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ రిటైల్‌ ఆపరేషన్స్‌ హెడ్‌ ఇ.చందన్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

ఈడీ అధికారులు తీవ్రంగా కొట్టారు...

హైకోర్టును ఆశ్రయించిన శరత్‌ చంద్రారెడ్డి ఉద్యోగి

హైదరాబాద్‌, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): ఈడీ అధికారులు తనను తీవ్రంగా కొట్టారని, థర్డ్‌ డిగ్రీ ప్రయోగించారని పేర్కొంటూ ట్రైడెంట్‌ కెమ్‌ఫార్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ రిటైల్‌ ఆపరేషన్స్‌ హెడ్‌ ఇ.చందన్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో ఈడీ అరెస్ట్‌ చేసిన అరబిందో ఫార్మా డైరెక్టర్‌ శరత్‌చంద్రా రెడ్డి ఈ కంపెనీకి కూడా డైరెక్టర్‌గా ఉన్న విషయం తెలిసిందే. ఇటీవల ఈడీ అధికారులు తన ఇంట్లో సోదాలు చేశారని, ఆ సందర్భంగా తనపై భౌతిక దాడి చేశారని పిటిషన్‌లో పేర్కొన్నారు. ముఖం, చెవులపై తీవ్రంగా కొట్టడంతో వినికిడి శక్తిని కోల్పోయానని, దీంతో నాలుగు రోజులపాటు ఆస్పత్రిలో చేరాల్సి వచ్చిందని తెలిపారు. తనపై ఈడీ ఎలాంటి కఠిన చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వడంతోపాటు.. అధికారుల ప్రొసీడింగ్స్‌ను కొట్టేయాలని కోరారు. ఈ పిటిషన్‌పై చీఫ్‌ జస్టిస్‌ ఉజ్జల్‌ భుయాన్‌, జస్టిస్‌ సీవీ భాస్కర్‌రెడ్డి నేతృత్వంలోని ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకు పిటిషనర్‌కు వ్యతిరేకంగా ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని ఆదేశాలు జారీచేసింది. ఈ మేరకు కౌంటర్‌ దాఖలు చేయాలని ఈడీకి ఆదేశాలు జారీచేసింది. తదుపరి విచారణను డిసెంబరు 12కి వాయిదావేసింది.

Updated Date - 2022-11-25T03:05:17+05:30 IST