రూ.1250 కోట్లు!
ABN , First Publish Date - 2022-10-11T08:53:24+05:30 IST
కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని కన్నెపల్లి (మేడిగడ్డ), సిరిపురం (అన్నారం) పంప్హౌ్సల మునక నష్టం లెక్కతేలుతోంది.
- కాళేశ్వరం మునక నష్టం ఇదీ..
- మేడిగడ్డలో రూ.1150 కోట్లు,
- అన్నారంలో రూ.100 కోట్లు
- ప్రాథమిక అంచనా మాత్రమే
- లెక్కలన్నీ తీస్తే మరింత పెరగొచ్చు
- మొత్తం భారం ప్రభుత్వం భరించాల్సిందే!
హైదరాబాద్, అక్టోబరు 10 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని కన్నెపల్లి (మేడిగడ్డ), సిరిపురం (అన్నారం) పంప్హౌ్సల మునక నష్టం లెక్కతేలుతోంది. ఈ ఏడాది జూలైలో వచ్చిన వరదతో కన్నెపల్లి పంప్హౌస్ పూర్తిగా ధ్వంసం కాగా, సిరిపురం పంప్హౌస్ నీట మునిగిన విషయం తెలిసిందే. అయితే దీంతో జరిగిన నష్టం ఎంత ఉంటుందనే దానిపై ఇప్పటిదాకా ఎలాంటి లెక్కలు తీయలేదు. తాజాగా తీసిన ప్రాథమిక లెక్కల్లో మేడిగడ్డలో ఏకంగా రూ.1150 కోట్లు, అన్నారంలో రూ.100 కోట్ల దాకా నష్టం జరిగిందని గుర్తించారు. మేడిగడ్డలో 6 మోటార్లు పూర్తిగా దెబ్బతినగా, ఒక్కో మోటార్కు రూ.40 కోట్ల చొప్పున రూ.240 కోట్లు, ప్యానల్ బోర్డులు/స్విచ్డ్ గేర్ ఎక్వి్పమెంట్కు రూ.250 కోట్లు, సివిల్ పనులకు రూ.300 కోట్లు, పంప్లు, క్రేను, ఇతరత్రా పరికరాలు కలుపుకొని రూ.1150 కోట్ల నష్టం జరిగినట్లు తేల్చారు.
లెక్కలన్నీ తీస్తే నష్టం మరింత పెరిగే అవ కాశం ఉండవచ్చని తెలుస్తోంది. ఇదిలా ఉండగా అన్నారం పంప్హౌస్లో నీట మునిగిన మోటార్ల విడిభాగాలను తొలగించి, ఆరబెట్టిన అనంతరం వాటిని తిరిగి అమర్చే పని జరుగుతోంది. కాళేశ్వరంలోని అదనపు టీఎంసీకి చెందిన ప్యానల్ బోర్డు ఎక్వి్పమెంట్తో అన్నారం పంప్హౌస్లో ని నాలుగు మోటార్లను నడపాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించి.. ఒక మోటార్ను ఆదివారం రోజు ఐదు నిమిషాలపాటు నడిపింది. ప్రతి పది రోజులకు ఒకటి చొప్పున నవంబరు 10కల్లా అన్నారంలోని మిగిలిన మోటార్లు కూడా నడపాలని నిర్ణయించారు. మొత్తం నాలుగు మోటార్లను అన్నారంలో సిద్ధంగా ఉంచనున్నారు. ఇక మేడిగడ్డలో కుప్పకూలిన, కొట్టుకుపోయిన రక్షణ గోడ నిర్మాణం ప్రస్తుతం చేపడుతున్నారు. ఆ పంప్హౌ్సలోని ఆరు మోటార్లు పూర్తిగా ధ్వంసం కావడంతో.. వాటి జోలికి వెళ్లకుండా మిగిలిన 11 మోటార్లలో ఆరింటిని మరమ్మతు చేసుకోవాలని నిర్ణయించారు. రక్షణ గోడ నిర్మాణం పూర్తయిన తర్వాతే మోటార్ల విడిభాగాలను విప్పనున్నారు.
డిసెంబరులో మేడిగడ్డ..
కన్నెపల్లి(మేడిగడ్డ)లో ఒకొక్కటి 40 మెగావాట్ల సామర్థ్యం కలిగిన 17 మోటార్లు/ ఉన్నాయి. అందులో 11 మోటార్లు రోజుకు రెండు టీఎంసీల నీటిని ఎత్తిపోయడానికి ఉద్దేశించినవి కాగా, దెబ్బతిన్న 6 మోటార్లు మాత్రం అదనపు టీఎంసీకి చెందినవే. దాంతో ఆరు మోటార్ల జోలికి వెళ్లకుండా 11 మోటార్లలో ఒక దానిని తొలిదశ లో వచ్చే డిసెంబరులో (రెండు నెలల్లో) నడిపించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దాంతో ప్యానల్ బోర్డు/స్విచ్డ్గేర్ ఎక్వి్పమెంట్ల కోసం ఆర్డర్ ఇచ్చినట్లు సమాచారం. అయితే ఖర్చునంతా ప్రభుత్వమే భరించే అవకాశాలున్నాయి. ప్రకృతి వైపరీత్యాల వల్ల కలిగే నష్టం డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్లో లేకపోవడమే ఇందుకు కారణం.