రోహింగ్యాలను నిర్బంధించవచ్చు
ABN , First Publish Date - 2022-09-13T10:04:21+05:30 IST
రోహింగ్యాలను వారి స్వదేశానికి తిరిగే పంపే వరకు నిర్బంధించే అధికారం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు ఉందని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది.
వారు శరణార్థులు కాదు.. హైకోర్టులో కేంద్రం వాదనలు
హైదరాబాద్, సెప్టెంబర్ 12 (ఆంధ్రజ్యోతి): రోహింగ్యాలను వారి స్వదేశానికి తిరిగే పంపే వరకు నిర్బంధించే అధికారం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు ఉందని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. రోహింగ్యాలను శరణార్థులుగా గుర్తించలేదని తెలిపింది. వారు కేవలం అక్రమంగా నివాసం ఉంటున్న విదేశీయులు మాత్రమేనని స్పష్టంచేసింది. వివిధ క్రిమినల్ కేసుల్లో నిందితులుగా ఉండి బెయిల్ పొందినప్పటికీ రోహింగ్యాలను విడుదల చేయకుండా హైదరాబాద్లోని చర్లపల్లి జైలులో నిర్బంధించడంపై హైకోర్టులో పలు హెబియస్ కార్పస్ పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లపై జస్టిస్ షమీమ్ అక్తర్, జస్టిస్ ఈవీ వేణుగోపాల్ల ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ.. బెయిల్ పొందినప్పటికీ క్రిమినల్ కేసుల ట్రయల్ ముగిసే వరకు లేదా వారిని తిరిగి పంపే వరకు నిర్బంధిస్తామనడం సరికాదని తెలిపారు. కేంద్రం తరఫున అడిషనల్ సొలిసిటర్ జనరల్ సూర్యకరణ్రెడ్డి వాదనలు వినిపిస్తూ.. రోహింగ్యాలను భారత్ శరణార్థులుగా గుర్తించలేదని తెలిపారు.