మంత్రి మల్లారెడ్డిపై రెడ్ల కన్నెర్ర
ABN , First Publish Date - 2022-05-30T08:33:30+05:30 IST
రాష్ట్ర కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. రెడ్ల సింహగర్జన సభలో ఆయనపై రెడ్డి కులస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
- రెడ్ల సింహగర్జన సభలో నిరసన సెగ
- కేసీఆర్ను, టీఆర్ఎస్ను పొగడడంపై ఆగ్రహం
- మంత్రి ప్రసంగాన్ని అడ్డుకున్న సభికులు
- వెళ్లిపోయేందుకు మల్లారెడ్డి ప్రయత్నం
- మంత్రి కాన్వాయ్పై కుర్చీలు, చెప్పులు..
- పోలీసుల భద్రతతో వెళ్లిపోయిన మంత్రి
- విజయవంతమైన రెడ్డి జేఏసీ సింహగర్జన సభ
- భారీ సంఖ్యలో తరలివచ్చిన రెడ్డి కులస్తులు
ఘట్కేసర్, మే 29 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. రెడ్ల సింహగర్జన సభలో ఆయనపై రెడ్డి కులస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మేడ్చల్ జిల్లా ఘట్కేసర్లో ఆదివారం రాత్రి జరిగిన ఈ సభకు ముఖ్యఅతిథిగా హాజరైన మల్లారెడ్డి.. తన ప్రసంగంలో పదే పదే సీఎం కేసీఆర్ను, టీఆర్ఎ్సను పొగుడుతూ మాట్లాడటంపై మండిపడ్డారు. మల్లారెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇందుకు ఆగ్రహించిన మంత్రి.. మధ్యలోనే వెళ్లిపోయేందుకు ప్రయత్నించగా ఆయన వాహనంపై కుర్చీలు, వాటర్ బాటిళ్లతో దాడి చేశారు. దీంతో సభలో ఉద్రిక్తత నెలకొంది. తొలుత మల్లారెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులను ఏకరవు పెట్టారు. అయితే రూ.5 వేల కోట్లతో ఏర్పాటు చేస్తానన్న రెడ్డి కార్పొరేషన్ ఏమైందని సభికులు ఆయనను ప్రశ్నించారు. ఇందుకు మంత్రి సమాధానమిస్తూ.. సీఎం కేసీఆర్ అన్ని కులాలకు కార్పొరేషన్లు, భవనాలు ఇస్తున్నారని, దళితులకు దళిత బంధు ఇస్తున్నారని చెప్పారు.
మళ్లీ టీఆర్ఎస్సే అధికారంలోకి వస్తుందని అన్నారు. అయితే ఇక్కడ ఇవన్నీ ఎందుకంటూ మంత్రి ప్రసంగానికి పలువురు అడ్డు తగిలారు. దీంతో ‘‘మా ప్రభుత్వం చేసిన పనులను చెప్పుకోవద్దా..’’ అని మల్లారెడ్డి వ్యాఖ్యానించారు. మళ్లీ కేసీఆర్పై ప్రశంసలు మొదలుపెట్టారు. దీనిపై సభికులు మరింత ఆగ్రహంతో ఊగిపోయారు. కుర్చీలు, చెప్పులు పైకెత్తి నిరసన తెలిపారు. దళితబంధు గురించి ఇక్కడెందుకు అంటూ జేఏసీ నాయకులు వేదికపైనే మంత్రిని చుట్టుముట్టి ప్రశ్నించారు. పరిస్థితిని గమనించిన పోలీసులు రంగంలోకి దిగి మంత్రిని అక్కడి నుంచి తీసుకెళ్లే ప్రయ్నతం చేశారు. మంత్రి వేదిక దిగుతుండగా.. పలువురు అక్కడికి దూసుకువచ్చి మల్లారెడ్డి డౌన్.. డౌన్ అంటూ నినాదాలు చేశారు. మంత్రి వాహనం వెంట పరుగులు తీస్తూ వాటర్ బాటిళ్లు, కుర్చీలు విసిరారు. ఎట్టకేలకు పోలీసులు భారీ భద్రత నడుమ మంత్రిని అతికష్టమ్మీద అక్కడి నుంచి పంపించేశారు.
కార్పొరేషన్ ఏర్పాటు చేసే దాకా ఆందోళన..
అంతకుముందు రెడ్ల జేఏసీ సింహగర్జన మహాసభలో వక్తలు.. రూ.5 వేల కోట్లతో రెడ్డి కార్పొరేషన్ను ఏర్పాటు చేసే దాకా ఆందోళనను తీవ్రం చేయాలని పిలుపునిచ్చారు. రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పిన సీఎం కేసీఆర్.. మూడున్నరేళ్లుగా కాలయాపన చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయా పార్టీల్లో రెడ్డి నాయకులు ఉండి ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటుతోపాటు ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయ రంగానికి అనుసంధానం చేయాలనే డిమాండ్తో దేశ రాజధాని ఢిల్లీలో ఆందోళన నిర్వహించాలన్నారు. రెడ్డి సంహగర్జన సభ.. రెడ్డి కులస్తుల ఐక్యతకు నిదర్శనమన్నారు. రెడ్డి జేఏసీ చైర్మన్ అప్పమ్మగారి రాంరెడ్డి అధ్యక్షతన జరిగిన బహిరంగ సభకు రాష్ట్రం నలుమూలల నుంచి రెడ్డి కులస్తులు భారీగా తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రేమేందర్రెడ్డి, కాంగ్రె స్ నాయకుడు సింగిరెడ్డి హరివర్ధన్రెడ్డి, టీఆర్ఎస్ నాయకుడు మర్రి రాజశేఖర్రెడ్డి, జేఏసీ నాయకులు పోలాడి రామారావు, మాధవరెడ్డి, నరేందర్రెడ్డి, రాధిక, నాగమణి, జైపాల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.