నిర్మల్‌లో అరుదైన సతీ శిలలు

ABN , First Publish Date - 2022-03-16T08:45:57+05:30 IST

నిర్మల్‌ జిల్లా ముధోల్‌ మండల కేంద్రంలోని వివిధ ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో సతీ శిలలను గుర్తించినట్లు కొత్త తెలంగాణ చరిత్ర బృంద సభ్యులు తెలిపారు.

నిర్మల్‌లో అరుదైన సతీ శిలలు

కల్యాణి చాళుక్యుల కాలంనాటివిగా గుర్తింపు

హైదరాబాద్‌ సిటీ, మార్చి15 (ఆంధ్రజ్యోతి): నిర్మల్‌ జిల్లా ముధోల్‌ మండల కేంద్రంలోని వివిధ ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో సతీ శిలలను గుర్తించినట్లు కొత్త తెలంగాణ చరిత్ర బృంద సభ్యులు తెలిపారు. అక్కడ లభ్యమైన శిల్పాల శైలి ఆధారంగా అవి కళ్యాణి చాళుక్యుల కాలానికి చెందినవిగా చరిత్ర పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. సాధారణంగా గుజరాత్‌, మహారాష్ట్ర తదితర చోట్ల సతీ శిలలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. అయితే, అలాంటి శిల్పాలు తెలంగాణ రాష్ట్రంలోని ముధోల్‌, బాసర, చుచుంద్‌, కల్లూరు తదితర ప్రాంతాల్లోనూ వెలుగు చూడటం విశేషం. ఆ ప్రాంతాల్లో ఒకప్పుడు సతీ ఆచారం ప్రబలంగా ఉండేదనడానికి అక్కడ వెలుగుచూసిన శిల్పాలే నిదర్శనం. అయితే, అవగాహన లేమితో పదుల సంఖ్యలో నెలవైన సతీ శిలలను స్థానికులు ఊరచెరువులో పారేసినట్లు సమాచారం. ముధోల్‌లోనే వర్ధమాన మహావీరుని విగ్రహం ఒకచోట, దాని అధిష్ఠాన పీఠం మరొక చోట లభ్యమయ్యాయని కొత్త తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్‌ శ్రీరామోజు హరగోపాల్‌ పేర్కొన్నా రు. దానికి సమీపంలోనే భూగర్భ సున్నపు పొరతో పాటు భారీగా ఇటుకలు లభించాయని చరిత్ర పరిశోధకులు చెబుతున్నారు. వీటితో పాటు జైన బసదులలో కనిపించే మెట్టు వంటి ఒక శంఖలతా తోరణ శిల్పాన్ని పరిశోధకుడు బలగం రామ్మోహన్‌, స్థానికులు భూమేశ్‌, సాయినాథ్‌ గుర్తించారు. ఇవి శాతవాహనుల కాలానికి చెందినవిగా చరిత్ర అధ్యయనకారులు అభిప్రాయపడుతున్నారు. 

Updated Date - 2022-03-16T08:45:57+05:30 IST